North Korea: ఈ పని చేస్తే పాకిస్థాన్ మన పెంపుడు పిల్లే!: సుబ్రహ్మణ్య స్వామి

  • ఉత్తర కొరియాపై ఫలించిన ట్రంప్ వ్యూహం
  • అదే దారిలో నడవాలంటున్న స్వామి
  • పాక్ ను భయపెట్టి దారిలోకి తేవాలని సూచన

ఎంతకీ కొరుకుడు పడని ఉత్తర కొరియాను దారిలోకి తెచ్చుకునేందుకు ట్రంప్ పన్నిన వ్యూహాన్నే భారత్, పాక్ పై అవలంబించాలని బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి సలహా ఇచ్చారు. ఓ శత్రువును లొంగదీసుకునేందుకు ట్రంప్ వేసిన ఎత్తులు ఇప్పుడు వారి మధ్య చర్చల వరకూ వెళ్లాయని గుర్తు చేస్తూ, పాకిస్థాన్ ను అదే విధంగా దారిలోకి తెచ్చుకోవాలని సూచించారు.

తొలుత పాకిస్థాన్ ను భయపెట్టాలని, ఇండియా తలచుకుంటే, ఆ దేశాన్ని నాలుగు ముక్కలు చేయగలుగుతుందన్న ఆందోళనను పుట్టించాలని తన ట్విట్టర్ ఖాతాలో స్వామి వ్యాఖ్యానించారు. ఇక రెండో దశలో చైనాను తటస్థంగా ఉంచాలని, ఆపై పాకిస్థాన్ ఓ పెంపుడు పిల్లిలా ఇండియా ముందు తోకాడిస్తూ కూర్చుంటుందని అన్నారు. సుబ్రహ్మణ్య స్వామి చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుండగా, సరిగ్గా చెప్పారంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

More Telugu News