Facebook: ఫేస్ బుక్ లో 'పోస్ట్'... ఇల్లు గుల్లచేసింది!

  • రెండు రోజులు ఊరికి వెళుతున్నట్టు పోస్ట్
  • వెళ్లొచ్చేసరికి ఇంట్లో దొంగతనం
  • రూ. 5 లక్షల విలువైన ఆభరణాలు ఎత్తుకెళ్లిన చోరులు

అనుక్షణం ఫేస్ బుక్ తో గడుపుతూ, ప్రతి క్షణాన్ని ఫ్రెండ్స్ తో షేర్ చేసుకునే అలవాటు ఎంతో మందికి ఉంటుంది. ఒక్కోసారి పెట్టే పోస్టు ఎంతటి అనర్థానికి దారితీస్తుందో చెప్పకనే చెప్పే ఘటన ఇది. ఓ యువతి తాను ఊరికి వెళుతూ, "రెండు రోజులు ఫేస్‌ బుక్‌ కు విరామం. నేను మా ఊరికి వెళ్తున్నాను" అని పెట్టిన పోస్టు, ఆమె ఇల్లును గుల్ల చేసింది.

పోలీసులు వెల్లడించిన మరింత సమాచారం ప్రకారం, బెంగళూరులోని ఆర్ టీ నగర్ పరిధిలో నివాసముండే ప్రేమ అనే యువతి, గత శనివారం ఫేస్ బుక్ లో ఓ పోస్టు పెడుతూ, తాను ఊరికి వెళుతున్నట్టు పేర్కొంది. ఆ పోస్టుకు ఎన్ని లైక్ లు వచ్చాయో తెలియదుగానీ, విషయం తెలుసుకున్న దొంగలు మాత్రం తమ చేతికి పని చెప్పారు.

ఇంటి తాళాలను బద్దలు కొట్టి ప్రవేశించిన దొంగలు, బీరువాను పగులగొట్టి, అందులోని రూ. 5 లక్షల విలువైన నగలను దోచుకెళ్లారు. నిన్న ఉదయం ఊరి నుంచి తిరిగి వచ్చిన ప్రేమ, ఇంట్లో దొంగతనం గురించి తెలుసుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. తాను ఫేస్ బుక్ లో పెట్టిన పోస్టు కారణంగానే దొంగతనం జరిగిందని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె వాపోగా, కేసును నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు.

More Telugu News