Karnataka: ఈ సీజన్ లో తొలిసారిగా శ్రీశైలం, సాగర్ డ్యామ్ లకు మొదలైన ఇన్ ఫ్లో... దాదాపు నిండిన నారాయణపూర్!

  • తూర్పు కర్ణాటకలో కురుస్తున్న వర్షాలు
  • ఐదు టీఎంసీల నీరు చేరితే నారాయణపూర్ నిండినట్టే
  • శ్రీశైలానికి 5,577 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

తూర్పు కర్ణాటకతో పాటు పశ్చిమ తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తూ ఉండటంతో, ఈ సీజన్ లో తొలిసారిగా ప్రాజెక్టులకు ఇన్ ఫ్లో ప్రారంభమైంది. శ్రీరాంసాగర్, జైక్వాడ్, ఆల్మట్టి జలాశయాలకు ఇన్ ఫ్లో లేనప్పటికీ, నారాయణపూర్ జలాశయానికి 11,720 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది. మొత్తం 37.65 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యమున్న ప్రాజెక్టులో ప్రస్తుతం 32.14 టీఎంసీల నీరు నిల్వ ఉండగా, 12,067 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 9.66 టీఎంసీల నిల్వ సామర్థ్యమున్న జూరాల జలాశయంలో ప్రస్తుతం 8.11 టీఎంసీల నీరుండగా, 261 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తుండగా, 2,495 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

ఇక శ్రీశైలం జలాశయం విషయానికి వస్తే, ఈ ఉదయం 5,577 క్యూసెక్కుల ఇన్ ఫ్లో నమోదైంది. ప్రస్తుతం జలాశయంలో 142 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం నుంచి 13,642 క్యూసెక్కుల నీటిని కుడి, ఎడమ కాలువలతో పాటు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ నీటిలో 8,698 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ రిజర్వాయర్ కు చేరుతుండగా, సాగర్ నుంచి 21,354 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. సోమశిల జలాశయానికి 1,039 క్యూసెక్కులు, ఏలేరు జలాశయానికి 221 క్యూసెక్కులు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కు 875 క్యూసెక్కుల నీరు వస్తోంది.

More Telugu News