Telangana: ఓట్లు అడుక్కునే వారే ఇఫ్తార్ విందు ఇస్తారు.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు

  • హిందువులను చంపేస్తున్న వారు ఇచ్చే పార్టీలకు వెళ్లాలా?
  • తెలంగాణ నాయకులు విందుల్లో బిజీగా ఉన్నారు
  •  ఓటు బ్యాంకు రాజకీయాలు చేయగలమని నిరూపిస్తున్నారు

తెలంగాణకు చెందిన వివాదాస్పద బీజేపీ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓట్లు అడుక్కునే వారే ఇఫ్తార్ విందులు ఇస్తారని అన్నారు. అటువంటి పార్టీలను తాను ఇవ్వబోనని, వేరే వారు ఇచ్చిన పార్టీలకు తాను వెళ్లబోనని స్పష్టం చేశారు. తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్న గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు. పవిత్ర రంజాన్ మాసంలో ఇతర నాయకుల్లానే తనను కూడా ఇఫ్తార్ విందులు ఇవ్వాలని స్నేహితుడు ఒకరు తనకు సూచించాడని అందులో పేర్కొన్నారు.

‘‘ప్రస్తుతం చాలామంది తెలంగాణ నాయకులు ఇఫ్తార్ విందులు ఇవ్వడంలో బిజీగా ఉన్నారు. టోపీలు ధరించి సెల్ఫీలు తీసుకుంటున్నారు. తాము కూడా ఓటు బ్యాంకు రాజకీయాలు చేయగలమని నిరూపిస్తున్నారు. అయితే, వారు ‘సబ్‌కా  సాథ్..సబ్‌కా వికాశ్’ గురించి ఆలోచిస్తే బాగుంటుంది’’ అని పేర్కొన్నారు. ఇఫ్తార్‌కు హాజరయ్యే వారందరూ వోటు బికారీలు (ఓట్లు అడుక్కునే వారు) అని వారు అనుకుంటున్నారని, కానీ తాను అలా అనుకోవడం లేదని పేర్కొన్నారు. హిందువులను చంపేస్తున్న వారు ఇస్తున్న ఇఫ్తార్ విందులకు తానెలా హాజరుకాగలనని ప్రశ్నించారు. కాగా, గతంలోనూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినందుకు గాను పలుమార్లు ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

More Telugu News