USA: మా ఉత్పత్తులపై భారీ టారిఫ్ లు ఆపకపోతే, భారత్ తో వాణిజ్యం ఆపేస్తాం: ట్రంప్ హెచ్చరిక

  • భారత్ లో 100 శాతం టారిఫ్ లు
  • మేం మాత్రం ఏమీ వసూలు చేయడం లేదు
  • ఇవి ఆగిపోవాలి... లేదంటే వాణిజ్యాన్ని ఆపేయాల్సి ఉంటుంది

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ద్వైపాక్షిక వాణిజ్యం విషయంలో మరో సారి భారత్ కు హెచ్చరికలు జారీ చేశారు. ఇతర దేశాలతో పారదర్శక వాణిజ్యం కోసం అమెరికా అవసరమైనన్ని చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.

 ‘‘నేను చెప్పేదేమంటే... మాకు భారత్ ఉంది. అక్కడ కొన్ని టారిఫ్ లు 100 శాతంగా ఉన్నాయి. కానీ, మేం మాత్రం ఏమీ చార్జీ వసూలు చేయడం లేదు. మేం అలా చేయం. అందుకే అన్ని దేశాలతో మాట్లాడుతున్నాం. ఈ విధమైన టారిఫ్ లు ఆగిపోవాలి. లేదా వారితో వాణిజ్యాన్ని మేం ఆపేయాల్సి ఉంటుంది’’ అని జీ7 సదస్సుపై వివరించేందుకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ట్రంప్ భారత్ కు హెచ్చరికలు పంపారు.

అమెరికా ఎగుమతులకు టారిఫ్ లు ఏ విధంగా అడ్డుపడుతున్నాయనే అంశంపై ట్రంప్ మాట్లాడుతూ భారత్ ప్రస్తావన తీసుకొచ్చారు. తాము పిగ్గీ బ్యాంకు మాదిరిగా ఉంటే, అందరూ తమను దోచేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది మొదట్లోనూ అధిక టారిఫ్ ల విషయమై భారత్ తీరును ట్రంప్ తప్పుబట్టారు.

More Telugu News