sunil chhetri: ఛెత్రి సాధించాడు..భారత్‌దే ఇంటర్‌కాంటినెంటల్‌ ఫుట్‌బాల్‌ కప్‌!

  • అదరగొట్టిన టీమిండియా ఫుట్‌బాల్ జట్టు
  • ఫైనల్లో కెన్యాపై అద్భుత విజయం
  • అత్యధిక గోల్స్‌తో మెస్సీ సరసన చేరిన ఛెత్రి

ఒకే ఒక్క పిలుపుతో దేశం మొత్తాన్ని కదిలించిన భారత ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ సునీల్ ఛెత్రి అనుకున్నది సాధించాడు. ఇంటర్ కాంటినెంటల్ ఫుట్‌బాల్ కప్‌ను దేశానికి సగర్వంగా అందించాడు. ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో కెన్యాపై 2-0తో విజయం సాధించిన భారత జట్టు కప్పును ఎగరేసుకుపోయింది.

ముంబై ఫుట్‌బాల్ ఎరీనాలో జరిగిన మ్యాచ్‌లో తొలి నుంచి భారత ఆధిపత్యం కొనసాగింది. కెరీర్‌లో 102వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఛెత్రి రెండు అద్భుతమైన గోల్స్‌తో జట్టుకు విజయాన్ని అందించాడు. మరోవైపు ప్రత్యర్థి కెన్యా జట్టుపై ఒత్తిడి పెంచడంలో భారత ఆటగాళ్లు సఫలం అయ్యారు. కెన్యా గోల్‌ ప్రయత్నాలకు గోల్‌కీపర్‌ గుర్‌ప్రీత్‌ సింగ్‌ సంధు గండికొట్టాడు. డిఫెండర్లు సైతం చక్కని ప్రతిభ కనబరిచి విజయంలో కీలకపాత్ర పోషించారు.

ఈ టోర్నీలో తొలి నుంచి భీకర ఫామ్‌లో ఉన్న కెప్టెన్ ఛెత్రి అరుదైన రికార్డు అందుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్ ఆటగాళ్లలో అత్యధిక గోల్స్ కొట్టిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కాడు. మొత్తం 64 గోల్స్ కొట్టి అర్జెంటీనా సూపర్ స్టార్ లియోనల్ మెస్సి సరసన చేరాడు. ఈ జాబితాలో క్రిస్టియానో రొనాల్డో 81 గోల్స్‌తో అగ్రస్థానంలో ఉన్నాడు. తాజా టోర్నీలో భారత్ 11 గోల్స్ సాధించగా అందులో 8 ఛెత్రివే కావడం గమనార్హం.

More Telugu News