NIRmala sitharaman: వీవీఎస్ లక్ష్మణ్, సానియా మీర్జా, గోపీచంద్ ల మద్దతు కోరిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

  • బీజేపీకి మద్దతు కోరిన కేంద్ర మంత్రి
  • నాలుగేళ్ల మోదీ పాలనలో సాధించిన విజయాలతో పుస్తకం బహూకరణ
  • కేర్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ సోమరాజుతోనూ సమావేశం

తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ క్రీడాకారులు వీవీఎస్ లక్ష్మణ్, సానియా మీర్జా, పుల్లెల గోపీచంద్ లను కేంద్ర వాణిజ్య శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ కలుసుకున్నారు. సమాజంలోని వివిధ వర్గాల వారి మద్దతు సమీకరణకు గాను బీజేపీ ‘సంపర్క్ ఫర్ సమర్థన్’ పేరుతో ఓ కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే.

2019 ఎన్నికల్లో మరోసారి బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగానే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఇటీవలే బాలీవుడ్ సీనియర్ నటీమణి మాధురిదీక్షిత్, శివసేన చీఫ్ ఉద్దవ్ ఠాక్రేలతో భేటీ అయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగానే నిర్మలాసీతారామన్ కూడా  ప్రముఖ క్రీడాకారులతో సమావేశమై వారి మద్దతు కోరడం జరిగింది.

ఈ సందర్భంగా లక్ష్మణ్, సానియా మీర్జా, గోపీచంద్ కు ఓ పుస్తకాన్ని సీతారామన్ అందించారు. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారధ్యంలోని సర్కారు నాలుగేళ్ల కాలంలో సాధించిన విజయాలను పేర్కొనడం జరిగింది. వీరికంటే ముందు కేర్ హాస్పిటల్స్ చైర్మన్, వ్యవస్థాపకుడు డాక్టర్ సోమరాజుతోనూ సీతారామన్ భేటీ అయ్యారు.

More Telugu News