Tamilnadu: తమిళ సినీ దర్శకుడు అమీర్‌పై బీజేపీ కార్యకర్తల దాడి!

  • చర్చా కార్యక్రమంలో అమీర్‌పై దాడికి యత్నం
  • సురక్షితంగా అక్కడి నుంచి తప్పించిన నిర్వాహకులు
  • దర్శకుడి కారుగా అనుమానించి గడ్డపారలతో దాడి

బీజేపీపైనా, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పైనా ఆరోపణలు గుప్పిస్తున్న కోలీవుడ్ దర్శకుడు అమీర్‌పై బీజేపీ కార్యకర్తలు దాడి చేశారు. కోవైలోని ఓ కల్యాణ మండపంలో నిర్వహించిన రాజకీయ చర్చావేదికలో ఈ ఘటన చోటుచేసుకుంది. కార్యక్రమంలో అమీర్ సహా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళసాయ్ సౌందర్ రాజన్, కొంగు ఇళంజర్ పేరవై నిర్వాహకుడు తనియరసు తదితరులు పాల్గొన్నారు.

చర్చ ప్రారంభమైన తర్వాత అమీర్ మాట్లాడుతుండగా బీజేపీ కార్యకర్తలు మధ్యలో అడ్డు తగిలి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది మరింత ముదరడంతో నిర్వాహకులు కల్పించుకుని అమీర్‌ను అక్కడి నుంచి ఆయన బస చేసిన హోటల్‌కు తరలించారు. అనంతరం  ఆ రాత్రి కొంగు ఇళంజర్‌ పేరవై నిర్వాహకులు కారులో కరుమత్తంపట్టి గ్రామానికి బయలుదేరారు. ఆ కారులో దర్శకుడు అమీర్ ఉన్నట్టు అనుమానించిన బీజేపీ కార్యకర్తలు కొందరు  దాన్ని అడ్డగించి రాళ్లు, గడ్డపారలతో దాడి చేశారు.

కారు అద్దాలు పగిలిపోవడంతో భయభ్రాంతులకు గురైన కారులోని వారు కిందికి దిగారు. వారిలో దర్శకుడు అమీర్ లేకపోవడంతో బీజేపీ కార్యకర్తలు అక్కడి నుంచి పరారయ్యారు. పేరవై నిర్వాహకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News