Telangana: తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి తప్పిన ప్రమాదం

  • గణపురంలో పల్లెనిద్ర ముగించుకుని వస్తుండగా ప్రమాదం
  • స్పీకర్ కాన్వయ్ లోని ఎస్కార్ట్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ
  • రోడ్డు పక్కకు దూసుకెళ్లిన ఎస్కార్ట్ వాహనం

తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారికి తృటిలో ప్రమాదం తప్పింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. గణపురం నుంచి భూపాల పల్లికి వెళ్తుండగా స్పీకర్ ఎస్కార్ట్ వాహనాన్ని లారీ ఢీ కొట్టింది. దేవాదుల ప్రాజెక్టు పనుల నిమిత్తం పైపులను తీసుకు వెళ్తున్న లారీ ఎస్కార్ట్ వాహనాన్ని ఢీ కొట్టడంతో  ఆ వాహనం రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో స్పీకర్ మధుసూదనాచారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

 వెంటనే అప్రమత్తమైన పోలీసులు మధుసూదనాచారిని క్షేమంగా గమ్యస్థానానికి చేర్చారు. ఈ ప్రమాదంపై మంత్రులు, ప్రజాప్రతినిధులు ఆయనకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. లారీ డ్రైవర్ తప్పిదం వల్లే ఈ సంఘటన జరిగిందని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

 కాగా, గణపురంలో నిన్న రాత్రి  మధుసూదనాచారి పల్లె నిద్ర చేశారు. ఈరోజు ఉదయం స్థానిక ప్రజలతో కలిసి గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. అనంతరం, రైతులతో కలిసి నాగలి పట్టిన ఆయన దుక్కిదున్నారు. ఈ పర్యటన ముగించుకుని ఈరోజు తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగింది.  

More Telugu News