maoist: మావోయిస్టులు లేఖ రాశారన్నది అబద్ధం : వరవరరావు

  • కేంద్రంతో జాతీయ మీడియా కుమ్మకైంది
  • ఇదంతా బీజేపీ రాజకీయ కుట్రలో భాగమే
  • ప్రజా జీవితంలో ఉన్న వారికి మావోయిస్టు పార్టీ ఎప్పుడైనా లేఖలు రాసిందా?

ప్రధాని మోదీ హత్యకు మావోయిస్టులు కుట్ర పన్నారనే విషయాన్ని బీజేపీ నేతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు. మరోపక్క, వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ ఇలాంటి సానుభూతి నాటకాలాడుతోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తాజాగా, ఇదే విషయమై విరసం నేత వరవరరావు స్పందించారు.

 మీడియాతో ఆయన మాట్లాడుతూ, కేంద్రంతో జాతీయ మీడియా కుమ్మకైందని, ప్రజా జీవితంలో ఉన్న వారికి మావోయిస్టు పార్టీ ఎప్పుడైనా లేఖలు రాసిందా? అని ప్రశ్నించారు. రోనాల్డ్ విల్సన్ ల్యాప్ టాప్ లో దొరికిన లేఖ అబద్ధమని, ఈ లేఖలో తన పేరు ఉందంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని, పూణె పోలీసులు చేస్తున్న ఆరోపణలను కొట్టి పారేస్తున్నానని అన్నారు.

ఇదంతా బీజేపీ రాజకీయ కుట్రలో భాగమేనని ఆరోపించారు. అక్రమంగా అరెస్టులు చేసి ప్రజా ఉద్యమాలను అణచి వేసేందుకు బీజేపీ చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేల సంఖ్యలో ఆదివాసీలను హత్య చేస్తున్నారని, కోరేగావ్ ఘటనకు బాధ్యుడు ఆర్ఎస్ఎస్ కార్యకర్త శంభాజీబిడే అని, రిలయన్స్ సంస్థ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న ఏడుగురిపై అక్రమంగా కేసులు నమోదు చేశారని అన్నారు. ఇద్దరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను కాపాడే ప్రయత్నమే ఈ కుట్రకు మూలమని ఆరోపించారు. సురేందర్ గాడ్గిల్, రోనాల్డ్ విల్సన్ లతో తనకు ఇరవై ఏళ్ల పరిచయం ఉందని చెప్పారు.  

More Telugu News