redmi y2: షియోమీ నుంచి మరో నాజూకు ఫోన్ వై2... ధర రూ.9,999

  • 3జీబీ, 4జీబీ ర్యామ్ తో రెండు వేరియంట్లు
  • రూ.9999, రూ.12,999గా ధర ఖరారు
  • ఈ నెల 12న మొదటి ఫ్లాష్ సేల్

చైనాకు చెందిన షియోమీ మరో స్మార్ట్ ఫోన్ ను దేశీయ యూజర్ల కోసం తీసుకొచ్చింది. నిన్న జరిగిన కార్యక్రమంలో రెడ్ మీ వై2ను ఆవిష్కరించింది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. 3జీబీ ర్యామ్, 32జీబీ స్టోరేజీతో ఉన్న మోడల్ ధర రూ.9,999. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ.12,999. చైనాలో ఇటీవలే విడుదలైన ఎస్2 ఫోన్ ఇక్కడ వై2గా రావడం గమనార్హం.

ఈ ఫోన్ ఫుల్ స్క్రీన్ డిస్ ప్లేతో, 18:9 యాస్పెక్ట్ రేషియోతో ఉంటుంది. స్క్రీన్ 5.99 అంగుళాల సైజుతో హెచ్ డీ ప్లస్ తో ఉంటుంది. స్క్రీన్ రిజల్యూషన్ 269 పీపీఐ. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్ ను వాడారు. రెండు సిమ్ కార్డులు, ఎస్డీ కార్డు కోసం వేర్వేరు స్లాట్లను ఏర్పాటు చేసింది. ఆండ్రాయిడ్ ఓరియో 8.1పై పనిచేస్తుంది. ముఖ్యంగా సెల్ఫీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఫోన్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరా సెన్సర్లను అమర్చినట్టు కంపెనీ తెలిపింది. ముందు భాగంలో 16 మెగా పిక్సల్ కెమెరా, వెనుక భాగంలో 12 ప్లస్ 5 మెగాపిక్సల్ కెమెరాలున్నాయి. 3,080 ఎంఏహెచ్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. రోజ్ గోల్డ్, చాంపేన్ గోల్డ్, ప్లాటినం సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. ఈ నెల 12న మొదటి ఫ్లాష్ సేల్ లో దీన్ని అమేజాన్ వెబ్ సైట్లో, ఎంఐ వెబ్ సైట్లో విక్రయించనున్నారు.

More Telugu News