kumaraswamy: కర్ణాటకలో మరోసారి వేడెక్కిన రాజకీయం.. రేపే కేబినెట్ విస్తరణ

  • రేపటి విస్తరణ జేడీఎస్ వరకే పరిమితం
  • ఎనిమిది నుంచి తొమ్మిది మందికి మంత్రి పదవులు
  • ఎవరెవరికి ఇవ్వాలనే విషయంలో దేవేగౌడదే తుది నిర్ణయం

ఎన్నో నాటకీయ పరిణామాల మధ్య కర్ణాటకలో జేడీఎస్-కాంగ్రెస్ ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటయిన విషయం తెలిసిందే. కర్ణాటకలో రేపు మరోసారి రాజకీయాలు వేడెక్కనున్నాయి. కేబినెట్ ను కుమారస్వామి రేపు మధ్యాహ్నం 2 గంటలకు విస్తరించనున్నారు. జూన్ 1న జరిగిన ఒప్పందం ప్రకారం కాంగ్రెస్ కు 22, జేడీఎస్ కు 12 మంత్రి పదవులు దక్కనున్నాయి. హోమ్, ఇరిగేషన్, హెల్త్, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమం తదితర శాఖలు కాంగ్రెస్ కు దక్కనున్నాయి. ఫైనాన్స్, ఎక్సైజ్, పబ్లిక్ వర్క్, విద్య, టూరిజం, రవాణా శాఖలను తీసుకోవడానికి జేడీఎస్ సమ్మతించింది.

అయితే, మంత్రి పదవుల కోసం జేడీఎస్ ఎమ్మెల్యేల నుంచి కుమారస్వామికి తీవ్ర ఒత్తిడి వస్తోంది. జేడీఎస్ కు తక్కువ మంత్రి పదవులు ఉండటంతో... తీవ్రమైన పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో కుమారస్వామి మాట్లాడుతూ, పార్టీలో అంతర్గత కుమ్ములాటలు లేవని చెప్పారు. రేపు జరగనున్న తొలిదశ కేబినెట్ విస్తరణలో జేడీఎస్ ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు దక్కబోతున్నాయని తెలిపారు. ఎనిమిది నుంచి తొమ్మిది మందిని కేబినెట్ లోకి తీసుకుంటామని... మరో రెండు, మూడు పదవులు ఖాళీగా ఉంటాయని చెప్పారు. పదవులను ఎవరికి కట్టబెట్టాలనే విషయంలో తమ అధినేత దేవేగౌడకే పూర్తి స్వేచ్ఛను ఇచ్చామని తెలిపారు. ఎమ్మెల్యేలంతా కేబినెట్ కు సహకరించాలని దేవేగౌడ ఈ రోజు జరిగిన పార్టీ మీటింగ్ లో స్పష్టం చేశారని చెప్పారు.

మరోవైపు రేపు కేబినెట్ విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలు ఢిల్లీకి వెళ్లనున్నట్టు సమాచారం. కాంగ్రెస్ తరపున ఎవరెవరికి మంత్రి పదవులను కేటాయించాలో అధిష్ఠానంతో చర్చించేందుకు వారు హస్తినకు బయలుదేరుతున్నారు. 

More Telugu News