anam ramnarayana reddy: టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఆనం.. వైసీపీలో చేరుతున్నట్టేనా?

  • టీడీపీ కార్యక్రమాలకు అంటీముట్టనట్టుగా ఆనం రామనారాయణ రెడ్డి
  • పార్టీపైన, నేతలపైన అసహనం
  • నవనిర్మాణ దీక్షకు కూడా దూరం

నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ ఛార్జి ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటుండటం చర్చనీయాంశంగా మారింది. ఆయన సోదరుడు ఆనం వివేకా మరణించినప్పటి నుంచి ఆయన మౌనం వీడలేదు. దీంతో, ఆయన పార్టీని వీడి, వైసీపీలో చేరబోతున్నారనే ప్రచారం మరింత ఎక్కువైంది. ఈ వార్తలను రామనారాయణ ఖండించకపోవడం మరింత చర్చకు దారితీస్తోంది.

ఇదే సమయంలో ఇటీవల జరిగిన మినీ మహానాడులో పార్టీపైన, పార్టీ నేతలపైన ఆయన అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు నిన్న ఆత్మకూరులో జరిగిన నవనిర్మాణ దీక్ష కార్యక్రమానికి నెల్లూరులో ఉండి కూడా ఆయన హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో, పలువురు పార్టీ నేతలు కూడా కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. ఈ సందర్భంగా కొందరు టీడీపీ నేతలు మాట్లాడుతూ, వెంటనే పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకుని, పరిస్థితిని చక్కదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. లేకపోతే ఎన్నికల నాటికి నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారవుతుందని చెప్పారు. 

More Telugu News