kanna lakshminarayana: రాహుల్ గాంధీ మెప్పు కోసమే బీజేపీపై విమర్శలు: కన్నా లక్ష్మీనారాయణ

  • చంద్రబాబుది నయవంచన దీక్ష
  • టీడీపీ, కాంగ్రెస్ ల మధ్య లోపాయికారీ ఒప్పందం ఉంది
  • 2019 ఎన్నికల్లో సత్తా చాటుతాం

ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలను స్వీకరించిన కన్నా లక్ష్మీనారాయణ ఈరోజు విజయవాడలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా కన్నాకు పలువురు బీజేపీ నేతలు అభినందనలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. చంద్రబాబు చేస్తున్న దీక్ష 'నయవంచన దీక్ష' అంటూ మండిపడ్డారు. చంద్రబాబును నమ్మే స్థితిలో రాష్ట్ర ప్రజలు లేరని చెప్పారు.

కాంగ్రెస్ పార్టీతో టీడీపీ లోపాయికారీ ఒప్పందం చేసుకుందని, రాహుల్ గాంధీ మెప్పు కోసం బీజేపీని విమర్శిస్తోందని అన్నారు. టీడీపీ నేతలంతా అవినీతిలో కూరుకుపోయారని విమర్శించారు. బీజేపీపై టీడీపీ నేతలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొడతామని అన్నారు. ఏపీ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. 2019 ఎన్నికల్లో ఏపీలో సత్తా చాటుతామనే ధీమాను వ్యక్తం చేశారు.

More Telugu News