Madhya Pradesh: వైరల్ అయిన 'గోవిందా స్టయిల్' డ్యాన్స్ చేసిన అంకుల్ వివరాలివిగో!

  • 'ఆప్ కీ ఆజానే సే' అంటూ డ్యాన్స్
  • ఆయన మధ్యప్రదేశ్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్
  • పేరు సంజీవ్ శ్రీవాత్సవ, వయసు 46

గడచిన వారం పదిరోజులుగా సోషల్ మీడియాలో హల్ చేస్తున్న అంకుల్ డ్యాన్స్ ను మీరు చూసే ఉంటారు. ఆయన ఎవరన్న వివరాలు తెలిసిపోయాయి. మధ్యప్రదేశ్ కు చెందిన ఎలక్ట్రానిక్స్ ప్రొఫెసర్ సంజీవ్ శ్రీవాత్సవ (46) ఆయన. తన బావమరిది పెళ్లి వేడుక గ్వాలియార్ లో జరుగగా, దానికి వెళ్లిన ఆయన సంగీత్ లో 'ఆప్ కీ ఆజానే సే' అనే 1987 నాటి 'ఖుద్ గర్జ్' చిత్రంలోని గోవిందా పాటకు డ్యాన్స్ చేశారు.

దీన్ని వీడియో తీసిన ఆయన బంధువు ఒకరు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అది వైరల్ అయింది. వాట్స్ యాప్, ట్విట్టర్, ఫేస్ బుక్... ఎక్కడా చూసినా ఆయన వీడియో కనిపించింది. మే 12న ఈ వీడియోను షూట్ చేశారని చెప్పిన సంజీవ్, తనకు ఇంత గుర్తింపు వస్తుందని అనుకోలేదని అన్నారు. తన భార్య అంజలితో కలసి స్టేజ్ పై డ్యాన్స్ చేశానని ఆయన చెప్పారు.

తన డ్యాన్స్ కు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఫిదా అవడాన్ని తాను జీవితంలో మరువలేనని, ట్విట్టర్ లో తన నృత్యాన్ని చూసిన ఆయన, "మధ్యప్రదేశ్ నీటిలోనే ఏదో ప్రత్యేక ఉంది" అని వ్యాఖ్యానించారని సంజీవ్ గుర్తు చేసుకున్నారు. గత రెండు రోజులుగా తన ఫోన్ రింగ్ అవుతూనే ఉందని, గంట వ్యవధిలో తాను 100 కాల్స్ మాట్లాడాల్సి వచ్చిందని, మీడియా తన ఇంటర్వ్యూలు, ఫొటోల కోసం వస్తోందని, బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి సైతం ఫోన్ చేసి అభినందించారని, తాను ఇదంతా నమ్మలేకున్నానని వ్యాఖ్యానించారు. ఆయన డ్యాన్స్ చేసిన వీడియోను మరోసారి చూడండి.

More Telugu News