Manchu Manoj: జూబ్లీహిల్స్ పబ్‌లో నటుడు మంచు మనోజ్ వీరంగం!

  • ఫ్యాట్ పీజియన్ పబ్‌లో మనోజ్ హల్‌చల్
  • సౌండ్ పెంచనందుకు స్పీకర్లను పగలగొట్టిన నటుడు
  • ఫిర్యాదు చేయని పబ్ యాజమాన్యం

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ ఓ పబ్బులో అర్ధరాత్రి వీరంగమేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గత నెల 22న జూబ్లీహిల్స్ రోడ్ నంబరు 45లో ఉన్న ఫ్యాట్ పీజియన్ పబ్‌కు మనోజ్ వెళ్లాడు. అప్పటికే రాత్రి 11.30 గంటలు కావడంతో నిర్వాహకులు డీజే సౌండ్ తగ్గించారు. సౌండ్ పెంచాలని మనోజ్ కోరినా వారు వినిపించుకోకపోవడంతో ఆగ్రహంతో రెచ్చిపోయాడు. స్పీకర్లను పగలగొట్టాడు.

సమాచారం అందుకున్న పోలీసులు పబ్‌కు చేరుకుని మనోజ్‌ను ప్రశ్నించారు. తాను ఫేస్‌బుక్ లైవ్ ఆన్ చేశానని, సౌండ్ ఎక్కువగా ఉండడంతో తగ్గించమని మాత్రమే చెప్పానని మనోజ్ వారికి వివరించాడు. దీంతో, అసలక్కడేం జరిగిందో తెలుసుకునేందుకు పబ్‌లోని సీసీ టీవీ ఫుటేజీలను పోలీసులు సేకరించారు. మనోజ్‌పై ఫిర్యాదు చేసేందుకు పబ్ నిర్వాహకులు ముందుకు రాకపోవడంతో ఈ ఘటనపై కేసు నమోదు కాలేదు. అయితే, జనరల్ డైరీ (జీడీ)లో మాత్రం ఈ ఘటనను నమోదు చేసినట్టు జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపారు.

More Telugu News