Pawan Kalyan: లోకేష్ కు నేనంటే చాలా కోపం!: పవన్ కల్యాణ్

  • లోకేష్ గారూ, మీ ప్రభుత్వం నిలబడటానికి నేనే కారణం
  • అశోక్ గారూ, పవన్ కల్యాణ్అంటే నేనే! 
  • అప్పుడు కాంగ్రెస్ లో ఉన్నవారు.. ఇప్పుడు వైసీపీలో ఉన్నారు

ఏపీ మంత్రి నారా లోకేష్ కు తానంటే చాలా కోపమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. 'లోకేష్ గారూ, మీ ప్రభుత్వం నిలబడటానికి నేనే కారణమనే విషయాన్ని గుర్తుంచుకోండి' అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పాలనలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని ఆరోపించారు. టీడీపీ, వైసీపీ నేతలు భయపెట్టినంత మాత్రాన... తాము చేతులు కట్టుకుని కూర్చోబోమని అన్నారు. విజయనగరం కోట జంక్షన్ వద్ద జరిగిన సభలో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు విమర్శలు గుప్పించారు.

తానెవరో తెలియదంటూ ఎంపీ అశోక్ గజపతి రాజు వ్యాఖ్యానించారని పవన్ మండిపడ్డారు. ఇప్పుడు మీ కోట వద్దకు వచ్చి మాట్లాడుతున్నానని... తానే పవన్ కల్యాణ్ అని అన్నారు. 2014లో నేను వచ్చి ప్రచారం చేస్తేనే, ఇప్పుడు మీరు పదవిని అనుభవిస్తున్నారని ఎద్దేవా చేశారు.

రాష్ట్రాన్ని ముక్కలు చేసే సమయంలో బొత్స సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని... ఇప్పుడు వైసీపీలో ఉన్నారని పవన్ అన్నారు. అప్పుడు కాంగ్రెస్ లో ఉన్న నేతలే ఇప్పుడు వైసీపీలో ఉన్నారని... బ్రాందీ, కేబుల్ వ్యాపారాలు చేసుకుంటూ, ఏళ్ల తరబడి నాయకులుగా చలామణి అవుతున్నారని విమర్శించారు. 

More Telugu News