September: 8,235 ఆర్జిత సేవా టిక్కెట్లను లాటరీకి ఉంచిన టీటీడీ!

  • సెప్టెంబర్ నెల టిక్కెట్లు అందుబాటులోకి
  • మొత్తం 49,060 టిక్కెట్ల విడుదల
  • బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తగ్గిన కోటా

సెప్టెంబర్ నెలకు సంబంధించిన శ్రీ వెంకటేశ్వరస్వామివారి ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ కొద్దిసేపటి క్రితం ఆన్ లైన్ లో విడుదల చేసింది. సెప్టెంబరుకు సంబంధించి మొత్తం 49,060 టిక్కెట్లను అందుబాటులో ఉంచిన టీటీడీ, వీటిల్లో 8,235 టిక్కెట్లను లక్కీ డిప్ విధానంలో భక్తులకు కేటాయించనున్నట్టు తెలిపింది. సుప్రభాత సేవకు 6,805, తోమాల సేవకు 80, అర్చనకు 80, అష్టదళ పాదపద్మారాధన సేవకు 120, నిజపాద దర్శనానికి 1,150 టికెట్లను లాటరీలో అందిస్తామని పేర్కొంది.

ఇంకా వీటితో పాటు విశేష పూజకు 1,500, కల్యాణోత్సవంకు 9,975, ఊంజల్‌ సేవకు 3,150, ఆర్జిత బ్రహ్మోత్సవంకు 5,500, వసంతోత్సవంకు 9,900, సహస్ర దీపాలంకరణకు 10,800 టిక్కెట్లను ఎప్పటిలా ఆన్ లైన్ లో బుక్ చేసుకోవచ్చని పేర్కొంది. లక్కీ డిప్ లో పాల్గొనే భక్తులు, నేటి నుంచి నాలుగు రోజుల్లోగా నమోదు చేసుకోవాల్సి వుంటుంది. కాగా, సెప్టెంబరులో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలున్న సందర్భంగా ఆర్జిత సేవా టిక్కెట్ల కోటా గణనీయంగా తగ్గింది.

More Telugu News