ramzan: రంజాన్‌ పండుగకు రూ.33 కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం!

  • వచ్చేనెల 8న ఇఫ్తార్‌ విందు
  • ఎల్బీ స్టేడియంలో ఏర్పాట్లను పర్యవేక్షించిన మహమూద్‌ అలీ
  • ప్రతి మసీదుకు ఇఫ్తార్ విందు కోసం లక్ష రూపాయలు

రంజాన్ పండుగను పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం 33 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, ఇందులో 15 కోట్ల రూపాయలు ఇఫ్తార్ విందు కోసం ఖర్చు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా వచ్చేనెల 8న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఇచ్చే ఇఫ్తార్ విందు ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మైనారిటీ సంక్షేమ శాఖ సలహాదారు ఎ.కె.ఖాన్, వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ మహ్మద్ సలీం, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి దాన కిషోర్, వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మహమూద్‌ అలీ మాట్లాడుతూ... ఇఫ్తార్ విందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 800 మసీదులకు గాను ఒక్కొక్క మసీదుకు 500 గిఫ్ట్ ప్యాకులను (బట్టలను) అందిస్తున్నట్లు చెప్పారు. నగరంలోని 400 మసీదులు, వివిధ జిల్లాలలోని 400 మసీదులకు ఈ గిఫ్ట్ ప్యాకులను అందిస్తున్నామన్నారు.

ప్రతి మసీదుకు ఇఫ్తార్ విందు కోసం లక్ష రూపాయలు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్ లో అధిక నిధులు కేటాయిస్తున్నామన్నారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాలలో మొదటి స్ధానంలో ఉందని అన్నారు. ఇఫ్తార్ విందుకు వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా ఎల్బీ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా బారికేడ్లు, మంచినీటి సరఫరా లతో పాటు శానిటేషన్, తాత్కాలిక టాయిలేట్లు ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పామన్నారు.

కాగా, ఇఫ్తార్ విందు సందర్భంగా విద్యుత్ కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేయాలని విద్యుత్ శాఖ అధికారులను మహమూద్‌ అలీ ఆదేశించారు. ఇఫ్తార్ విందులో పాల్గొననున్న ముఖ్యఅతిథులు, ప్రజా ప్రతినిధులకు ఎల్బీ స్టేడియం దగ్గర బందోబస్తుతో పాటు వాహనాల పార్కింగు కోసం ఏర్పాట్లు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ తో పాటు ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులకు చెప్పారు.

More Telugu News