Kolkata: అడక్కుండా పువ్వులు కోసిందని అత్తను చావబాదిన కోడలు.. వీడియో వైరల్!

  • అనుమతి లేకుండా పూలు కోసిన అత్తపై దాడి
  • మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేసిన పక్కింటి వ్యక్తి
  • గంటల వ్యవధిలోనే 5 లక్షల వ్యూస్

తన అనుమతి లేకుండా పూలు కోసిన అత్తను విచక్షణ రహితంగా చావబాదిందో కోడలు. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అత్త చెంపలు వాయించి, ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ, లాగి పడేస్తున్న కోడల్ని చూసిన పక్కింటి వ్యక్తి ఆ ఘటనను తన మొబైల్ ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో క్షణాల్లోనే వైరల్ అయింది. కోల్‌కతాలో జరిగిందీ ఘటన. వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ అయిన గంటల వ్యవధిలోనే 5 లక్షల మంది వీక్షించారు. 8,300 లైక్స్, 25 వేల షేర్లు వచ్చాయి.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫేస్‌బుక్ యూజర్ వివరాలు తెలుసుకుని ఆయన ఇంటికి వెళ్లగా, తనకు ఓ వైద్యుడి నుంచి ఆ వీడియో అందిందని తెలిపాడు. దీంతో పోలీసులు ఆ వైద్యుడిని కలవడంతో ఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడయ్యాయి.

పంచనంతల గారియాలో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. చివరికి అష్టకష్టాలు పడి బాధిత మహిళ ఇంటికి చేరుకున్నారు. బాధితురాలిని జశోదా పాల్ (75)గా గుర్తించారు. ఆమెపై దాడి చేసిన మహిళ కోడలు స్వప్నా పాల్ (40) అని పేర్కొన్నారు. గతంలో ఆమె అత్త ఇంట్లోనే ఉండేదని తెలిపారు. ఘటన జరిగినప్పుడు జశోదా మనవడు ఇంట్లోనే నిద్రపోతున్నట్టు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News