Congress: ఆర్థిక శాఖ మాక్కావాలి.. లేదు, మాక్కావాలి: కాంగ్రెస్-జేడీఎస్ మధ్య మొదలైన పదవుల పోట్లాట!

  • కాంగ్రెస్-జేడీఎస్ మధ్య మొదలైన విభేదాలు
  • ముఖ్యమైన మంత్రి పదవుల కోసం ఇరు పార్టీలు పట్టు
  • ఢిల్లీలో మూడు గంటలకు పైగా సాగిన సమావేశం

కర్ణాటకలోని అధికార కాంగ్రెస్-జేడీఎస్ కూటమిలో పదవుల కోసం పోట్లాట మొదలైంది. ఆర్థిక శాఖ మాకు కావాలంటే, లేదు, మాక్కావాలంటూ ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధానికి దిగుతున్నారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఇదేమీ పెద్ద సమస్య కాదని, నేటితో అది పరిష్కారమైపోతుందని సీఎం కుమారస్వామి ధీమా వ్యక్తం చేశారు.

ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నివాసంలో మూడు గంటలకు పైగా జరిగిన సమావేశంలో ఆర్థిక శాఖపై ఇరు పార్టీల మధ్య వాడివేడి చర్చ జరిగింది. ఆర్థిక శాఖను జూనియర్ పార్టనర్‌కు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోందని కుమారస్వామి తేల్చి చెప్పారు. ఆయన మాటలతో అగ్గిమీద గుగ్గిలమైన కాంగ్రెస్ నేతలు అదెలా కుదురుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో వెనక్కి తగ్గిన కుమారస్వామి తనకు కొంత సమయం కావాలని, జేడీఎస్ చీఫ్ దేవెగౌడను కలిసి ఈ విషయమై చర్చించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.

సుదీర్ఘంగా జరిగిన సమావేశంలో ఆర్థిక శాఖతో పాటు పలు ఇతర శాఖలపైనా చర్చ జరిగింది. విద్యుత్, నీటి వనరులు, పీడబ్ల్యూడీ శాఖలను జేడీఎస్ తమ వద్దే ఉంచుకోవాలని భావిస్తోంది. సీఎం సోదరుడు హెచ్‌డీ రేవణ్ణకు ఈ శాఖలు కేటాయించే అవకాశం ఉంది. కాంగ్రెస్ నేత డీకే శివకుమార్‌ విద్యుత్ శాఖను ఆశిస్తున్నారు. విదేశాల్లో ఉన్న కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీతో మాట్లాడిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటామని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు.

More Telugu News