Vijayawada: విజయవాడలో రోడ్డు ప్రమాదం: తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మకు గాయాలు!

  • మహానాడులో పాల్గొనేందుకు వచ్చిన సుగుణమ్మ
  • స్థానిక బెంజి సర్కిల్ వద్ద కారు, ఆటో ఢీ
  • సుగుణమ్మకు స్వల్ప గాయాలు.. ఆసుపత్రికి తరలింపు

తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ కారు ప్రమాదానికి గురయ్యారు. విజయవాడలో జరుగుతున్న మహానాడులో పాల్గొనేందుకు ఆమె ఇక్కడికి వచ్చారు. సిద్ధార్థ ఇంజనీరింగ్ కళాశాల వేదికగా జరుగుతున్న మహానాడులో పాల్గొనేందుకు ఆమె తన కారులో వెళ్తుండగా స్థానిక బెంజి సర్కిల్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ఎమ్మెల్యే కారు, ఆటో ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఆమెకు స్వల్ప గాయాలయ్యాయి. దీంతో, వెంటనే సమీప ఆసుపత్రికి ఆమెను తరలించి వైద్య చికిత్స అందించారు. ప్రమాదంలో గాయపడ్డ సుగుణమ్మను పలువురు నేతలు పరామర్శించారు.

కాగా, మహానాడులో పాల్గొనేందుకు వస్తున్న బాపట్ల మున్సిపల్ చైర్ పర్సన్ తోట మహాలక్ష్మి కారు కూడా నిన్న ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు టైరు పగిలిపోవడంతో వాహనం అదుపుతప్పింది. ఆ వాహనం ముందు ప్రయాణిస్తున్న మదనపల్లి మున్సిపల్ చైర్మన్ కె.శివప్రసాద్ కారును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మహాలక్ష్మి భర్త నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి.

More Telugu News