BJP: పవన్ కల్యాణ్ ను బీజేపీ వాడుకుంటోంది... ఆయనకు ఒక్క శాతం ఓట్లు కూడా రావు: చంద్రబాబు

  • బీజేపీ మాటలను నమ్మి నన్ను విమర్శిస్తున్నారు
  • ధర్మపోరాటంలో విజయం నాదే
  • మహానాడు వేదికపై చంద్రబాబు సుదీర్ఘ ప్రసంగం

తనను విమర్శించడానికి భారతీయ జనతా పార్టీ పవన్ కల్యాణ్ ను వాడుకుంటోందని, బీజేపీ మాటలను నమ్మి ఆయన తనపై నిత్యమూ అర్థరహిత విమర్శలు చేస్తున్నారని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిప్పులు చెరిగారు. ఈ ఉదయం మహానాడు వేదికగా, సుదీర్ఘ ప్రసంగం చేసిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఎన్నికల్లో పోటీ చేస్తానని అంటున్నారని, ఆయన పోటీ చేస్తే, ఆంధ్ర రాష్ట్రంలో ఆయనకు ఓట్లు వేసేవారు ఒక్క శాతం కూడా లేరని చంద్రబాబు ఎద్దేవా చేశారు.

బీజేపీ ధోరణి వల్లే రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా పోయిందని చెప్పారు. అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి అన్ని రకాల బిల్లులనూ కేంద్రానికి పంపినా, తమకేవీ అందలేదని అమిత్ షా తప్పుడు ప్రచారం చేస్తున్నారని విరుచుకుపడ్డారు. జాతీయ స్థాయి నేతలు మాట్లాడాల్సిన తీరు ఇది కాదని అన్నారు. అనవసరంగా ఓ రాష్ట్రంతో పెట్టుకుంటే, ఏం జరుగుతుందో కాంగ్రెస్ కు తెలిసొచ్చిందని, తదుపరి ఎన్నికల్లో బీజేపీకీ ప్రజలు అదే విధంగా బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. నమ్మకద్రోహం, కుట్ర రాజకీయాలపై తాను ధర్మపోరాటం చేస్తున్నానని, ఈ పోరాటంలో ప్రజలే అండగా, తాను విజయం సాధిస్తానన్న నమ్మకం తనకుందని తెలిపారు.

More Telugu News