Karnataka: కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే సిద్ధు న్యామగౌడ దుర్మరణం

  • గోవా నుంచి బాగల్ కోట్ వస్తుండగా ప్రమాదం
  • తులసిగెరి వద్ద జరిగిన ప్రమాదంలో సిద్ధు మృతి
  • అతివేగమే ప్రమాదానికి కారణం

ఇటీవలి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి విజయం సాధించిన సిద్ధు న్యామగౌడను విధి వెక్కిరించింది. ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన దుర్మరణం పాలయ్యారు. గోవా వెళ్లిన ఆయన, తిరుగు ప్రయాణంలో బాగల్ కోట్ వస్తుండగా, తులసిగెరి వద్ద ఆయన కారుకు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలు అయిన సిద్ధును వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆయన ప్రాణాలు మిగల్లేదు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని విచారణ ప్రారంభించారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. తమ ఎమ్మెల్యే మృతిపై కాంగ్రెస్ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య సంతాపాన్ని తెలిపారు. కాగా, జామ్ ఖండి నియోజకవర్గం నుంచి పోటీ చేసిన న్యామ్ గౌడ, తన సమీప బీజేపీ అభ్యర్థి శ్రీకాంత్ సుబ్బారావ్ కులకర్ణిపై 2,500 ఓట్లకు పైగా మెజారిటీతో విజయం సాధించారు.

More Telugu News