Pawan Kalyan: మాదాల రంగారావు ఆత్మకు శాంతి చేకూరాలి: పవన్ కల్యాణ్

  • మాదాల రంగారావు మరణవార్త విని చాలా బాధపడ్డా
  • మాదాల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి
  • టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక స్థానం పొందిన నటుడు మాదాల

రెడ్ స్టార్ గా పేరు తెచ్చుకున్న నటుడు మాదాల రంగారావు మృతిపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. మాదాల మరణవార్త విని తాను దిగ్భ్రాంతి చెందానని వ్యాఖ్యానించారు. తెలుగు చిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక స్థానం పొందిన నటుడు, దర్శకుడు, నిర్మాత మాదాల రంగారావు మృతి చెందారని తెలిసి చాలా బాధపడ్డానని అన్నారు.

80లలో మాదాల రంగారావు వామపక్ష, అభ్యుదయ భావాలతో తెరకెక్కించిన చిత్రాలు నాటి సమాజంలోని పరిస్థితులకి అద్దంపట్టాయని అన్నారు. ‘యువతరం కదిలింది’, ’ఎర్రమల్లెలు’, ’స్వరాజ్యం’, ‘విప్లవ శంఖం’ లాంటి చిత్రాలలో తెలుగు తెరపై తనదైన ముద్ర వేశారని అన్నారు. ఆ చిత్రాల్లోని కథాంశాలే కాకుండా పాటలు కూడా ఆలోచింపజేసేవేనని, అవినీతి, నేతల అణచివేత ధోరణులు, నిరుద్యోగ యువత ఇబ్బందుల్ని చిత్రాలుగా మలిచారని చెప్పారు. మాదాల రంగారావు కుటుంబ సభ్యులకి తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని, రంగారావు ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు.

More Telugu News