Agnatawasi: బిజినెస్ పేజీ న్యూస్ ఐటమ్ కథ రాసి తప్పు చేశా!: 'అజ్ఞాతవాసి' ఫ్లాప్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్

  • సినిమా కోసం రూ. 30 కోట్లు నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు
  • రూ. 25 కోట్లు వెనక్కిచ్చేశాం
  • ప్రేక్షకులు లీనం కాలేకపోయారన్న త్రివిక్రమ్

మాటల మాంత్రికునిగా పేరు తెచ్చుకుని, పలు సూపర్ హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన త్రివిక్రమ్ శ్రీనివాస్, తాజాగా ఓ పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ, పవన్ కల్యాణ్ హీరోగా తాను రూపొందించిన 'అజ్ఞాతవాసి' పరాజయంపై స్పందించారు. ఈ సినిమాను డిస్ట్రిబ్యూటర్లు రూ. 90 కోట్లకు కొనుగోలు చేయగా, రూ. 60 కోట్లు మాత్రమే వచ్చిందని, తాను కల్యాణ్, నిర్మాత కలసి రూ. 25 కోట్లను వెనక్కు ఇచ్చామని, తమను నమ్మి ఎదుటి వ్యక్తి నష్టపోకూడదన్న ఉద్దేశంతోనే ఈ పని చేశామని తెలిపారు. 'ఆజ్ఞాతవాసి' పరాజయం ప్రభావం తనపై చూపించిందని, సినిమా విషయంలో పలు తప్పులు చేశానని, ఎమోషన్ లేకుండా పోయిన చిత్రం ఇదని అన్నారు.

ఓ రాజు, ఓ రాజ్యం అంటూ అందరికీ తెలిసిన విధంగా కథను ప్రారంభిస్తే, ప్రేక్షకుడు త్వరగా లీనమైపోయుండేవారని, తాను ఆ పని చేయకుండా, కార్పొరేట్ నేపథ్యంలో బిజినెస్ పేజీకి మాత్రమే పరిమితమయ్యే న్యూస్ ఐటమ్ వంటి కథను తీసుకున్నానని, అందుకే ప్రేక్షకులు తిరస్కరించారని అన్నారు. పవన్ కల్యాణ్ స్పీచ్ లను తానే రాసిస్తానని జరుగుతున్న ప్రచారంపై స్పందిస్తూ, ఆయన బాగా రాయగలరని, ఓ పుస్తకం చదివిన వెంటనే, దానిపై అభిప్రాయాన్ని రాసుకునే పవన్ కు తాను ప్రసంగాలను రాసివ్వడం ఏంటని, ఈ ప్రచారం శుద్ధ అబద్ధమని చెప్పారు. తనకు రాజకీయాలపై ఆసక్తి లేదని అన్నారు.

More Telugu News