Siddipet District: సిద్ధిపేటలో ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొని దూసుకెళ్లిన లారీ.. 10 మంది మృతి

  • రెండు లారీలు, బస్సు, క్వాలీస్‌ పరస్పరం ఢీ
  • 26 మందికి గాయాలు
  • ఆసుపత్రులకు తరలింపు

సిద్ధిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌ రాజీవ్‌ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రెండు లారీలు, బస్సు, క్వాలీస్‌ పరస్పరం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 26 మంది గాయాలపాలు కాగా, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పోలీసులు దగ్గరలోని ఆసుపత్రులకు తరలించారు. అదుపుతప్పిన ఓ బస్సు... దాని ముందు ఉన్న లారీని ఢీ కొట్టగా, ఆ లారీ డివైడర్‌ను ఢీ కొట్టి ముందుకు దూసుకెళ్లింది.

అదే సమయంలో ఆ రోడ్డుపై వెళుతోన్న క్వాలీస్‌తో పాటు ఓ కంటైనర్‌ను సదరు లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో క్వాలీస్‌ పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదానికి కారణమైన బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది. దీనిపై సమాచారం అందుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. 

More Telugu News