Bollywood: అలనాటి బాలీవుడ్‌ నటి గీతాకపూర్‌ కన్నుమూత.. ఏడాది పాటు వృద్ధాశ్రమంలోనే ఉన్న వైనం

  • ఏడాది నుంచి పిల్లల కోసం ఎదురు చూపులు
  • మరో రెండు రోజుల పాటు భౌతిక కాయం ఆసుపత్రిలో..
  • పిల్లలు వచ్చి చూస్తారని ఆశిస్తున్నామన్న నిర్మాత అశోక్‌ పండిత్‌

అలనాటి బాలీవుడ్‌ నటి గీతా కపూర్‌ అనారోగ్యంతో బాధపడుతూ ముంబయిలోని ఓ ఆసుపత్రిలో మృతి చెందారని సీబీఎఫ్‌సీ సభ్యుడు, నిర్మాత అశోక్‌ పండిత్‌ ప్రకటించారు. ఏడాది నుంచి వృద్ధాశ్రమంలో ఉంటోన్న ఆమె తన పిల్లల కోసం ఎదురుచూస్తూ చివరకు వారిని చూడకుండానే కన్నుమూశారని తెలిపారు. గీతా కపూర్‌ పార్ధివ దేహాన్ని ముంబయిలోని విలే పర్లీలోని కూపర్‌ హాస్పిటల్‌లో రెండు రోజుల పాటు ఉంచుతామని, ఆమె పిల్లలు తమ తల్లిని చివరిసారి చూసుకుని అంత్యక్రియలు నిర్వహిస్తారని ఆశిస్తున్నామని చెప్పారు. ఒకవేళ గీతా కపూర్‌ పిల్లలు రాకపోతే తామే అంతిమ సంస్కారాలను నిర్వహిస్తామని తెలిపారు.

   కాగా, గతేడాది మేలో అనారోగ్యంతో బాధపడుతోన్న గీతా కపూర్‌ను ఆమె కుమారుడు రాజా ముంబయిలోని ఓ ఆసుపత్రికి తీసుకొచ్చి, తాను ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు తీసుకొస్తానని చెప్పి, ఆమెను అక్కడే వదిలి వెళ్లిపోయాడు. దీంతో ఈ విషయాన్ని తెలుసుకున్న సీబీఎఫ్‌సీ సభ్యుడు అశోక్‌ పండిత్‌ ఆమెకు ఆసుపత్రిలో చికిత్స చేయించి, వృద్ధాశ్రమానికి తీసుకెళ్లారు. తన కుమారుడు తనను కొట్టేవాడని, నాలుగు రోజులకు ఒకసారే అన్నం పెట్టేవాడని ఆ సందర్భంగా గీతా కపూర్‌ మీడియాకు చెప్పుకుని కన్నీరు పెట్టుకున్నారు. అలనాటి సూపర్ హిట్ హిందీ చిత్రం 'పాకీజా' ఫేంగా గీతా కపూర్‌కు మంచి పేరు వచ్చింది. ఆ తరువాత పలు సినిమాల్లో నటించారు.

More Telugu News