goa: గోవాలో ప్రియుడి ముందే సామూహిక అత్యాచారం.. ఇద్దరి అరెస్ట్

  • 20 ఏళ్ల యువతిపై ముగ్గురి అత్యాచారం
  • అత్యాచారం జరిగిందని తేల్చిన వైద్య నివేదిక
  • మూడో కామాంధుడి కోసం గాలింపు

గోవాలోని కోల్వా బీచ్ లో నిన్న 20 ఏళ్ల యువతిపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారం జరిపారు. 22 ఏళ్ల ఆమె బోయ్ ఫ్రెండ్ ముందే ఈ దారుణానికి తెగబడ్డారు. ఈ రేప్ కు సంబంధించి ఈరోజు ఇద్దరిని గోవా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా దక్షిణ గోవా ఎస్పీ అరవింద్ గవాస్ మాట్లాడుతూ, అత్యాచారానికి పాల్పడ్డ ధనంజయ్ పాల్ (23), రామ్ సంతోష్ భారియా (19)లను అరెస్ట్ చేశామని చెప్పారు. వీరంతా ఇండోర్ నుంచి వచ్చారని తెలిపారు. పరారీలో ఉన్న మూడో నిందితుడి కోసం గాలిస్తున్నామని తెలిపారు. అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురూ పర్యాటకులుగానే గోవాకు వచ్చారని చెప్పారు. వైద్య పరీక్షలో బాధితురాలు అత్యాచారానికి గురైనట్టు తేలిందని తెలిపారు.

అత్యాచారానికి గురైన యువతి దగ్గర్లోనే ఉన్న గ్రామం నుంచి వచ్చింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అత్యాచారాన్ని కెమెరాతో షూట్ చేశారని బాధితురాలు తెలిపింది. పోలీసులకు ఫిర్యాదు చేయరాదంటూ తనను బ్లాక్ మెయిల్ చేశారని పేర్కొంది. ఈ నేపథ్యంలో కామాంధులపై సెక్షన్ 376 (రేప్), సెక్షన్ 394 (దొంగతనం) కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News