uppal: పల్లీ పకోడీలో చచ్చిన బల్లి.. నిర్ఘాంతపోయిన వినియోగదారుడు!

  • హైదరాబాద్ లోని రామంతాపూర్ లో సంఘటన
  • శ్రీసాయి గణేష్ హోటల్, చిప్స్ దుకాణంలో పల్లీ పకోడి కొనుగోలు
  • ప్యాకెట్ లో చచ్చిన బల్లి.. ఫిర్యాదు చేసిన స్పందించని యజమాని

పల్లీ పకోడి తిందామనుకున్న వినియోగదారుడు నిర్ఘాంతపోయిన సంఘటన హైదరాబాద్ లోని రామంతాపూర్ లో జరిగింది. పల్లీ పకోడి తిందామని ఆ ప్యాకెట్ ఓపెన్ చేయగా, అందులో చచ్చిన బల్లి కనపడటంతో సదరు వినియోగదారుడు ఆశ్చర్యపోయాడు. దూరదర్శన్ కేంద్రం ఎదురుగా ఉన్న శ్రీసాయి గణేష్ హోటల్, చిప్స్ దుకాణంలో రంజిత్ సింగ్ అనే వ్యక్తి పల్లీ పకోడీల ప్యాకెట్ ని నిన్న కొనుగోలు చేశాడు. తిందామని ఆ ప్యాకెట్ విప్పగా చచ్చిన బల్లి ఉంది.

ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు తిరిగి ఆ దుకాణానికి వెళ్లాడు. నిర్వాహకులు సరైన సమాధానం చెప్పకపోవడంతో బాధిత వినియోగదారుడు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఆ దుకాణాన్ని సీజ్ చేయాలని డిమాండ్ చేశాడు. ఈ సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన శానిటేషన్ అధికారులు ఆ దుకాణాన్ని పరిశీలించారు. తినుబండారాల ప్యాకెట్లపై తయారీ తేదీలు లేకపోవడాన్ని గమనించారు. షాపు యజమానికి రూ.5 వేల జరిమానా విధించారు. తదుపరి చర్యలు తీసుకుంటామని ఉప్పల్ మున్సిపల్ ఏవోఎంహెచ్ ఉమా గౌరి తెలిపారు.

More Telugu News