Telangana: రైతుబంధు చెక్కుల పంపిణీపై అనుసరించాల్సిన వ్యూహంపై సమీక్ష

  • ప్రత్యేక అధికారులతో సమీక్షించిన తెలంగాణ సీఎస్ జోషి
  • ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించుకొని జిల్లాల్లో పర్యటించాలి
  • కలెక్టర్లకు మార్గనిర్దేశం చేయాలి
  • పాసుపుస్తకాల్లో తప్పులపై ప్రత్యేక దృష్టి సారించాలి

రాష్ట్ర వ్యాప్తంగా పట్టాదారు పాసు పుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీపై పర్యవేక్షణ నిమిత్తం ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారులు, ఆయా జిల్లా కలెక్టర్లతో అన్ని గ్రామాలకు సంబంధించి తగు కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి ఉన్నతాధికారులను ఆదేశించారు. పట్టాదారు పాసుపుస్తకాలు, రైతు బంధు చెక్కుల పంపిణీపై అనుసరించాల్సిన వ్యూహంపై ఈరోజు సచివాలయంలో ప్రత్యేక అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా జోషి మాట్లాడుతూ, జిల్లాలకు నియమించిన ప్రత్యేక అధికారులు ప్రత్యేక వ్యూహాన్ని రూపొందించుకొని జిల్లాల్లో పర్యటించి రైతులకు పాసు పుస్తకాలు, చెక్కుల పంపిణీ సజావుగా జరిగేలా కలెక్టర్లకు మార్గనిర్దేశం చేయాలని, జిల్లాల్లో సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి గ్రామాలలో పర్యటించి సమస్యలను గుర్తించి పరిష్కరించాలని, మండల అధికారుల బృందాలు ప్రతి గ్రామంలో పర్యటించేలా చూడాలని ఆదేశించారు.

 పాసుపుస్తకాలలోని తప్పులపై ప్రత్యేక దృష్టి సారించి, వాటిని సరిదిద్దేలా చూడాలన్నారు. జిల్లాలకు కేటాయించిన మంత్రులతో సమన్వయం చేసుకొని స్పెషల్ డ్రైవ్ తో ఓ కార్యక్రమం చేపట్టాలని, గ్రామాలలో నెలకొన్న సమస్యను అధ్యయనం చేయాలని జోషి ఆదేశించారు. ఇప్పటికే పంపిణీ చేసిన పట్టాదారు పాసుపుస్తకాలు, చెక్కులపై సమీక్షించాలన్నారు.

రాష్ట్ర వ్యాప్తంగా 57.33 లక్షల ఖాతాలు స్పష్టంగా ఉన్నాయని, ఇప్పటివరకు దాదాపు 40 లక్షలు పాస్ పుస్తకాలు పంపిణీ చేసినట్టు చెప్పారు. జిల్లాలో మిగిలిన పాసు పుస్తకాల పంపిణీకి సత్వర చర్యలు తీసుకోవాలన్నారు. ఆధార్ అనుసంధానించిన ఖాతాలకు డిజిటల్ సిగ్నేచర్లను సత్వరం పూర్తి చేయాలన్నారు. ఇప్పటికే ముద్రించిన పాసుపుస్తకాలలో పట్టాదార్ల పేర్లు తప్పుగా రావడం, పట్టాదారు చనిపోవటం, అమ్మకాలు జరగడం, ఫోటోలు తప్పుగా పడటం, విస్తీర్ణం తక్కువ, ఎక్కువగా నమోదు కావడం, అటవీ వివాదాలు తదితర అంశాలతో పాసుపుస్తకాలలో వివరాలు సరిగా నమోదు కాలేదని, వీటిని సరిదిద్దే విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలని జోషి ఆదేశించారు.

కొందరు తమ ఆధార్ వివరాలు ఇవ్వనందున పాసుపుస్తకాలు ముద్రించలేదని, మరికొందరు ఆధార్ సమర్పించినప్పటికి ఫోటోలు లేవని అన్నారు. జిల్లాలలో రైతు బంధు చెక్కులను నగదుగా మార్చుకొనేందుకు బ్యాంకులలో అందుతున్న నగదుపై దృష్టి సారించడంతో పాటు మిగిలిన చెక్కుల పంపిణీకి తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. చెక్కులు, పాసుపుస్తకాలు పంపిణీలో నాణ్యత పెరిగేలా తగు సూచనలు అందించాలని, జూన్ 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం పూర్తి అయ్యేలా చూడాలని జోషి ఆదేశించారు.

More Telugu News