kphb colony: కేపీహెచ్ బీ కాలనీలో.. బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న మహిళకు మత్తు బిళ్లలు ఇచ్చి, మొత్తం దోచేశారు!

  • పెళ్లి కూతురు మేకప్ బాధ్యతలు ఇస్తామంటూ మాటలు చెప్పిన కిలాడీలు
  • మత్తు బిళ్లలు ఇచ్చి, నగలు దోచేశారు
  • దొంగల కోసం గాలిస్తున్న పోలీసులు

పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా దొంగలు మాత్రం చెలరేగిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీ 6వ ఫేజ్ లో మరో చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే, చందానగర్ లో నివాసం ఉంటున్న జ్యోతి మంగేశ్వరి (47) అనే మహిళ కేపీహెచ్ బీ కాలనీలో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఓ మహిళ, ఓ యువతి కలసి బ్యూటీ పార్లర్ కు వచ్చారు.

తమ ఇంట్లో పెళ్లి ఉందని, పెళ్లికూతురు మేకప్ కాంట్రాక్ట్ ను మీకు అప్పగిస్తామని నమ్మబలికారు. అయితే, ముందు తమ ఇద్దరిలో ఒకరికి మేకప్ వేసి చూపించాలని, నచ్చితే కాంట్రాక్ట్ మీకేనని చెప్పారు. మేకప్ వేసే సమయంలో ఆభరణాలు ధరించరాదని కండిషన్ పెట్టారు. వారి మాటలను నమ్మిన మంగేశ్వరి... తన ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, చెవి కమ్మలు, నాలుగు ఉంగరాలు, నాలుగు చేతి గాజులు అల్మారాలో పెట్టి, భద్రపరిచారు.

ఆ తర్వాత మంగేశ్వరిని మాయమాటల్లో పెట్టిన ఇద్దరు కిలాడీలు... ఆమెకు మౌత్ ఫ్రెషనర్ పేరిట మత్తు బిళ్లలను అందించారు. విషయం తెలియని ఆమె ఆ బిళ్లలను చప్పరించి మత్తులోకి జారుకుంది. వెంటనే అల్మారాలో ఉన్న నగలను అపహరించి ఇద్దరూ పరారయ్యారు. ఆ తర్వాత కాసేపటికి మెలుకువ వచ్చిన మంగేశ్వరి అల్మారాలో నగలు కనిపించకపోవడంతో లబోదిబో మంటూ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు మహిళల కోసం గాలిస్తున్నారు. 

More Telugu News