Jagan: చంద్రబాబు కొత్త పెళ్లికూతురు వైపు చూస్తున్నారు: జగన్

  • బీజేపీతో విడాకులు తీసుకున్నాక... కాంగ్రెస్ వైపు చూస్తున్నారు
  • రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది
  • గ్రామ కమిటీల పేరుతో మాఫియాను తయారు చేశారు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై ప్రతిపక్ష నేత జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. నాలుగేళ్లపాటు బీజేపీతో కాపురం చేసి విడాకులు తీసుకున్న చంద్రబాబు... ఇప్పుడు కొత్త పెళ్లికూతురు (కాంగ్రెస్) వైపు చూస్తున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీతో విడిపోయాక ఇతరులపై నెపం నెట్టేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు కంటే పెద్ద అబద్ధాల కోరు మరొకరు లేరని అన్నారు.

'కర్ణాటకలో ఎమ్మెల్యేలను కొనడం చంద్రబాబుకు బాధను కలగజేసిందట' అంటూ ఎద్దేవా చేశారు. మరి ఏపీలో 23 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులను కొన్నట్టు కొనడంపై ఏం చెబుతారని ప్రశ్నించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి జరుగుతోందని.... కాంట్రాక్టులు, మట్టి, ఇసుక, మద్యం, బొగ్గు, రాజధాని భూములు, గుడి భూములు, చివరకు గుడిలోని ఆభరణాలను కూడా వదలడం లేదని అన్నారు.

గ్రామాల్లో జన్మభూమి కమిటీల పేరుతో మాఫియాను తయారు చేశారని జగన్ మండిపడ్డారు. గ్రామంలో ఎవరికి ఏం కావాలన్నా లంచాలు ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. ఇంతకాలం చంద్రబాబుకు ప్రత్యేక హోదా గుర్తుకు రాలేదని... మరో ఏడాదిలో ఎన్నికలు ఉన్నందున ఇప్పుడు అది ఆయనకు గుర్తుకు వచ్చిందని చెప్పారు. 

More Telugu News