Bollywood: చెక్కు పంపిస్తే తిప్పి పంపేశారు.. నయాపైసా తీసుకోలేదు!: అమితాబ్ ఔన్నత్యాన్ని చెప్పిన షారూక్ ఖాన్

  • నా సొంత బ్యానర్ పై నిర్మించిన ‘పహేళి’లో బిగ్ బీ నటించారు
  • కోటి రూపాయల చెక్ ఇస్తే అమితాబ్ తీసుకోలేదు
  • ఎందుకు తీసుకోరని అడిగా
  • నీతో కలిసి పని చేసిన ఏ సినిమాకు నేను డబ్బు తీసుకోనన్నారు 

అగ్ర తారలు తాము నటించే సినిమాలకు భారీ పారితోషికాలు తీసుకుంటూ ఉంటారు. అంతేకాకుండా, వాణిజ్య ప్రకటనల్లో నటించినా, ఏవైనా ప్రారంభోత్సవ కార్యక్రమాలకు హాజరైనా ఎంతోకొంత తీసుకుంటూ ఉంటారు. అలాంటి సినీ పరిశ్రమలో నయాపైసా పారితోషికం తీసుకోకుండా ఎవరైనా అగ్రనటుడు ఏదైనా సినిమాలో నటించడం సాధ్యమవుతుందా? అంటే.. అవుననే చెప్పొచ్చు.

అందుకు అమితాబ్ బచ్చన్ నిదర్శనమని ఎటువంటి అనుమానం లేకుండా చెప్పొచ్చు. తాను నమ్మిన విలువలకు, ప్రేమాభిమానాలకు, స్నేహానికి ఎంతో విలువనిచ్చే అమితాబ్  ఓ సినిమాలో అతిథిపాత్రలో నటించినందుకు ఎటువంటి పారితోషికం తీసుకోలేదు. ఆ పారితోషికమేమీ చిన్నమొత్తం కూడా కాదు..అక్షరాలా కోటి రూపాయలు!

ఈ ఆసక్తికర విషయాన్ని బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. షారూక్ ఖాన్ సొంత నిర్మాణ సంస్థ రెడ్ చిల్లీస్ ఎంటర్ టెయిన్ మెంట్ సుమారు పదమూడేళ్ల క్రితం తెరకెక్కించిన చిత్రం ‘పహేలి’. ఈ చిత్రంలో అమితాబ్ అతిథి పాత్రలో నటించారు. ఈ సినిమా షూటింగ్ పూర్తవగానే అమితాబ్ కు ఓ లేఖ తో పాటు కోటి రూపాయల చెక్కును పారితోషికంగా పంపానని షారూక్ చెప్పారు. తన సినిమాలో నటించడానికి అంగీకరించిన బిగ్ బీకు ఆ లేఖలో ధన్యవాదాలు తెలుపుతూ ఈ లేఖ రాశానని చెప్పారు.

అయితే, ఆశ్చర్యకరంగా తాను పంపిన చెక్ ను అమితాబ్ తిప్పి పంపేశారని.. ‘ఎందుకు తిరిగి పంపారు?’ అని తాను ప్రశ్నిస్తే అమితాబ్ చెప్పిన సమాధానం ఎన్నటికీ మరవలేనని షారూక్ చెప్పారు. ‘నీతో కలిసి పని చేసిన ఏ సినిమాకు నేను డబ్బు తీసుకోను’ అన్న అమితాబ్ సమాధానం విన్న తన ఆనందానికి అవధుల్లేవని చెప్పారు. నయాపైసా పారితోషికం తీసుకోకపోయినప్పటికీ, ఉదయాన్నే ఆరు గంటలకు సెట్స్ లో ఉండేవారని, అలాంటి గొప్ప వ్యక్తిని తానెప్పుడూ చూడలేదంటూ అమితాబ్ పై షారూక్ ప్రశంసలు కురిపించారు.

More Telugu News