amith sha: అమిత్ షా కాన్వాయ్ పై దాడి ఉద్దేశపూర్వకంగా జరిగిందే: మాణిక్యాలరావు ఆరోపణ

  • మా కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారు
  • ప్రశ్నించిన ప్రతి వ్యక్తికి బీజేపీతో సంబంధాలు పెడుతున్నారు
  • టీటీడీలో అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి

ఇటీవల తిరుమలలో పర్యటించిన అమిత్ షా కాన్వాయ్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఘటనకు పాల్పడింది టీడీపీ నేతలేనంటూ బీజేపీ విమర్శలు చేయడం విదితమే. తాజాగా, ఏపీ మాజీ మంత్రి మాణిక్యాలరావు ఈ అంశం గురించి ప్రస్తావించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, అమిత్ షా కాన్వాయ్ పై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారని ఆరోపించారు.

అమిత్ షాకు రక్షణగా ఉన్న తమ కార్యకర్తలపై పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారని, ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతి వ్యక్తికి బీజేపీతో సంబంధాలు పెడుతున్నారని దుయ్యబట్టారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో ప్రస్తుత పరిణామాల గురించి ఆయన ప్రస్తావించారు. టీటీడీలో అక్రమాలు జరిగిన విషయాన్ని చెబుతుంటే ఎదురుదాడికి దిగుతున్నారని, ఈ అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని మాణిక్యాలరావు డిమాండ్ చేశారు.

More Telugu News