Supreme Court: సొంతిల్లు కూడా కట్టుకోకుండా.. తప్పుచేశా!: అఖిలేష్ యాదవ్

  • మాజీలు ప్రభుత్వ బంగ్లాలు ఖాళీ చేయాలంటూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు
  • పలువురు రాజకీయ ప్రముఖులకు నోటీసులు
  • కొంత సమయం కావాలని సుప్రీంను కోరిన అఖిలేష్

పదవీకాలం ముగిసిన తర్వాత కూడా ప్రభుత్వ బంగ్లాల్లో ఉంటున్న మాజీలు వెంటనే ఖాళీచేయాల్సిందిగా సుప్రీంకోర్టు తాజాగా జారీ చేసిన ఆదేశాలు పలువురిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్ యాదవ్, మాయావతిలు ఇప్పటికీ అధికారిక బంగ్లాల్లోనే ఉంటున్నారు. పదవీకాలం ముగిసినా వారు బంగ్లాలను ఖాళీ చేయలేదు.

తాజాగా సుప్రీం ఉత్తర్వులతో వారు తమ నివాసాలను ఖాళీ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ సందర్భంగా అఖిలేష్ మాట్లాడుతూ, సొంత ఇల్లు కట్టుకోకుండా తాను పెద్ద తప్పు చేశానని అన్నారు. ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసి, అద్దె ఇంటికి మారేందుకు తనకు కొంత సమయం ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరానని చెప్పారు. కోర్టు తనకు మరికొంత సమయం ఇస్తే సొంత ఇంటిని నిర్మించుకుంటానని తెలిపారు.

సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత నోటీసులు అందుకున్న వారిలో కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్, రాజస్థాన్ గవర్నర్ కల్యాణ్ సింగ్, యూపీ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్, ఎన్డీ తివారీలు కూడా ఉన్నారు. లక్నోలోని విక్రమాదిత్య రోడ్డులోని 4వ నెంబర్ బంగ్లాలో అఖిలేష్ ఉండగా, ఐదో నంబర్ బంగ్లాలో గత 27 ఏళ్లుగా ములాయం సింగ్ ఉంటున్నారు. 

More Telugu News