Bandaru Dattatreya: మీరెళ్లండి... మేము చూసుకుంటామని చెప్పాం... ఇంతలోనే ఇంత దారుణం జరిగిపోయింది!: బీజేపీ నేత లక్ష్మణ్

  • రాత్రి జరిగిన ఘటనను తలచుకున్న లక్ష్మణ్
  • దత్తాత్రేయ వెళ్లిన రెండు గంటల తరువాత వైష్ణవ్ చనిపోయారని చెప్పిన డాక్టర్లు
  • దత్తన్నకు ఎలా చెప్పాలో తెలియలేదన్న లక్ష్మణ్

గత రాత్రి బండారు దత్తాత్రేయ కుమారుడు వైష్ణవ్ గుండెపోటుకు గురైన తరువాత జరిగిన ఘటనలను తలచుకుని బీజేపీ నేతలు లక్ష్మణ్, చింతల రామచంద్రరావులు కన్నీరు పెట్టుకున్నారు. వైష్ణవ్ ను ఆసుపత్రికి స్వయంగా దత్తాత్రేయే తీసుకు వచ్చారని, విషయం తెలుసుకున్న తాము హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లామని చెప్పారు.

"సార్.. ఏం కాదు. మేము చూసుకుంటాం. మీరు ఇంటికెళ్లండి" అని చెప్పడంతో ఆయన ఇంటికి వెళ్లారని, ఆపై రెండు గంటల వ్యవధిలోనే వైష్ణవ్ మరణించినట్టు డాక్టర్లు ప్రకటించారని ఆ వార్త విని తాము హతాశులమయ్యామని, విషయాన్ని దత్తన్నకు ఎలా చెప్పాలో తెలియలేదని అన్నారు. అంత దారుణమైన వార్తను విని ఆయన తట్టుకోలేరన్న ఉద్దేశంతోనే తెల్లారేవరకూ చెప్పలేదని అన్నారు.

ఆపై మీడియా ద్వారా విషయం తెలుసుకున్న బొంతు రామ్మోహన్ ఒంటి గంటకు ఆసుపత్రికి చేరుకున్నారని, దత్తన్నకు 5 గంటల సమయంలో ఫోన్ చేసి చెప్పామని, తన భార్యతో కలసి ఆసుపత్రికి వచ్చిన ఆయన, జీవం లేని కుమారుడిని చూసి బోరున విలపించారని, ఆయన్ను తాము ఆపలేకపోయామని అన్నారు.

More Telugu News