shankar: సినీ దర్శకుడు శంకర్ పై మండిపడుతున్న తమిళులు!

  • తూత్తుకుడిలో పోలీసుల కాల్పుల్లో 11 మంది చనిపోయారు
  • ఇదే సమయంలో ఐపీఎల్ లో చెన్నై గెలుపుపై ట్వీట్ చేసిన శంకర్
  • ప్రజలు చనిపోతే.. నీవు మ్యాచ్ ఎంజాయ్ చేశావా? అంటూ నెటిజన్లు ఫైర్

భారీ బడ్జెట్ సినిమాలకు, సూపర్ హిట్ మూవీలకు కేరాఫ్ అడ్రస్ అయిన కోలీవుడ్ దర్శకుడు శంకర్ పై తమిళులు నిప్పులు చెరుగుతున్నారు. వివరాల్లోకి వెళ్తే, తూత్తుకుడిలో వేదాంత కంపెనీకి చెందిన స్టెరిలైట్ కాపర్ యూనిట్ విస్తరణ పనులను వ్యతిరేకిస్తూ గత 100 రోజులుగా అక్కడి ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తుల విధ్వంసానికి వారు పూనుకున్నారు. ఆందోళనకారులను నిలువరించే ప్రయత్నంలో పోలీసులు జరిపిన కాల్పుల్లో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో, తమిళనాడు అట్టుడుకుతోంది.

ఇదే సమయంలో, నిన్న జరిగిన ఐపీఎల్ క్వాలిఫైయర్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజయం సాధించింది. ఈ నేపథ్యంలో 'వాట్ ఏ మ్యాచ్' అంటూ శంకర్ ట్వీట్ చేశారు. దీంతో, తమిళ నెటిజన్లు ఆగ్రహానికి గురయ్యారు. తూత్తుకుడిలో 11 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతే పట్టించుకోకుండా... మ్యాచ్ ను ఎంజాయ్ చేశావా? అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నీవు అసలు మనిషివేనా అని మండిపడ్డారు. దీంతో, తన ట్వీట్ ను శంకర్ తొలగించారు. 

More Telugu News