Chandrababu: గులాబీ వజ్రం పోయిందంటున్నారు.. ఇది వారి కుట్రలో భాగమే!: తిరుమల వివాదంపై చంద్రబాబు ఆగ్రహం

  • ప్రజల్లో అనుమానాలు వచ్చేలా బీజేపీ కుట్ర
  • రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారు
  • వెంకటేశ్వర స్వామి ఎప్పుడూ నన్ను ఆశీర్వదిస్తున్నాడు
  • అపచారం తలపెట్టిన వాడు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తాడు

ప్రజల్లో అనుమానాలు వచ్చేలా ఆరోపణలు చేస్తూ బీజేపీ కుట్రలు పన్నుతోందని, కొందరు గులాబీ రంగు వజ్రం పోయిందంటున్నారని, ఇవన్నీ కుట్రలో భాగమేనని, రాష్ట్రాన్ని అప్రతిష్టపాలు చేయాలని చూస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రోజు విశాఖపట్నంలోని ఏయూ ఇంజనీరింగ్‌ కాలేజీ మైదానంలో ధర్మ పోరాట బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... వెంకటేశ్వరస్వామి తనను ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తున్నాడని, శ్రీవారికి అపచారం తలపెట్టిన వాడు ఈ జన్మలోనే శిక్ష అనుభవిస్తాడని వ్యాఖ్యానించారు.

తిరుపతిలో పోయింది వజ్రం కాదని, కెంపు మాత్రమేనని కమిటీలు చెప్పాయని చంద్రబాబు తెలిపారు. సంప్రదాయాలు పాటించే పరిశుభ్రమైన ఆలయం తిరుపతి అని, పోటులో ఏదో జరిగిపోతోందని ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆ ప్రధాన అర్చుకుడిని ఢిల్లీకి పిలిపించుకుని కుట్రలు పన్నారని రమణ దీక్షితులను ఉద్దేశించి చంద్రబాబు అన్నారు.

ఆ ప్రధాన అర్చకుడు తన ఇంట్లో వెంకటేశ్వర స్వామి ఫొటో పక్కనే వైఎస్సార్ ఫొటో పెట్టుకున్నారని, ఆయన ఎలాంటి వ్యక్తో మీరే ఆలోచించుకోవాలని వ్యాఖ్యానించారు. తిరుపతిని పురావస్తు శాఖకు అప్పగించాలని కూడా అనుకున్నారని అన్నారు. రాష్ట్రంలో బ్రాహ్మణుల కోసం కార్పోరేషన్‌ పెట్టానని, బ్రాహ్మణుల్లోనూ పేదవారు ఉన్నారని, వారికి న్యాయం చేస్తున్నానని అన్నారు. అలాగే అర్చకులకు న్యాయం చేసిన ప్రభుత్వం టీడీపీ మాత్రమేనని, బీజేపీ పాలిస్తోన్న రాష్ట్రాల్లో ఇలా చేశారా? అని ప్రశ్నించారు.

More Telugu News