mla anitha: ప్రజల ద్వారా కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం: టీడీపీ ఎమ్మెల్యే అనిత

  • ఈ దీక్ష పార్టీ పరంగా చేపడుతున్నది కాదు
  • అందరినీ భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తున్నాం
  • ప్రతిపక్షం తమ పబ్బం గడుపుకునేందుకు చూస్తోంది

రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఏపీకి కేంద్ర ప్రభుత్వం చేసిన నమ్మక ద్రోహాన్ని, కుటిల రాజకీయాలను నిరసిస్తూ విశాఖపట్టణం వేదికగా ఏపీ సీఎం చంద్రబాబు ధర్మపోరాటదీక్ష చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యే అనిత మీడియాతో మాట్లాడుతూ, ఈ దీక్ష పార్టీ పరంగా చేపడుతున్నది కాదని, రాష్ట్ర భవిష్యత్ ని దృష్టిలో పెట్టుకుని అందరినీ భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.

ఈ విషయాన్ని ప్రజలకు తెలియజెప్పాలనే ఉద్దేశంతో పాటు ప్రజల ద్వారా కేంద్రం మీద ఒత్తిడి పెంచాలనేది మరో ఉద్దేశమని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీని, బీజేపీని తాము ఎండగడుతుంటే.. ప్రతిపక్షం మాత్రం ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని, తమ పబ్బం గడుపుకునేందుకు చూస్తోందని విమర్శించారు. ప్రతిపక్షం చేస్తున్న ఆ ప్రయత్నాలన్నింటిని ప్రజలకు తెలియజెప్పాలనేదే తమ ఉద్దేశమని అనిత చెప్పుకొచ్చారు.

More Telugu News