l ramana: పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో టీఆర్ఎస్సే నెంబర్ వన్: ఎల్.రమణ

  • 24న తెలంగాణ మహానాడును నిర్వహిస్తాం
  • టీఆర్ఎస్ హామీలపై తీర్మానాలు చేస్తాం 
  • కర్ణాటక ప్రజాకోర్టులో బీజేపీకి పరాభవం ఎదురైంది

పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడంలో దేశంలోనే టీఆర్ఎస్ పార్టీ ముందుందని టీటీడీపీ నేత ఎల్.రమణ అన్నారు. ఈనెల 24న తెలంగాణ మహానాడును నిర్వహించనున్నామని చెప్పారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు, నిరుద్యోగ సమస్యలు, రైతుల ఆత్మహత్యలు, అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులపై తీర్మానాలు చేస్తామని తెలిపారు.

ఆ తర్వాత జరిగే జాతీయ మహానాడులో ఐదు తీర్మానాలు చేస్తామని చెప్పారు. అప్రజాస్వామిక విధానాల్లో కర్ణాటకలో అధికారం కైవసం చేసుకోవాలనుకున్న బీజేపీకి... ప్రజాకోర్టులో పరాభవం ఎదురైందని ఎద్దేవా చేశారు. మరో టీడీపీ నేత రావుల చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ, 2019లో టీడీపీ మద్దతు లేకుండా తెలంగాణలో ప్రభుత్వం ఏర్పడబోదని ధీమా వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం మొత్తం తప్పుల తడకేనని విమర్శించారు.

More Telugu News