Airtel: మళ్లీ కోర్టుకు జియో... ఎయిర్ టెల్ పై 'ఐపీఎల్' వార్!

  • 'సీజన్ పాస్' అంటూ ఎయిర్ టెల్ యాడ్
  • కస్టమర్లను తప్పుదారి పట్టిస్తోందంటున్న జియో
  • గతంలోనే విచారించి తీర్పిచ్చిన ఢిల్లీ హైకోర్టు
  • అమలు చేయలేదంటూ మళ్లీ కోర్టుకు జియో

ఎయిర్ టెల్ తమ వ్యాపార ప్రకటనల ద్వారా తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తోందని ఆరోపిస్తూ రిలయన్స్ జియో మరోసారి కోర్టుకు ఎక్కింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో 'సీజన్ పాస్' అంటూ ఎయిర్ టెల్ సంస్థ 'లైవ్ అండ్ ఫ్రీ యాక్సెస్' పేరిట ప్రకటనలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ విషయంలో కస్టమర్లను ఆ సంస్థ తప్పుదారి పట్టిస్తోందని, హాట్ స్టార్ నుంచి మాత్రమే ప్రత్యక్ష ప్రసారం ఉంటుందని, దీన్ని చూసేందుకు డేటా చార్జీలు ఉంటాయన్న విషయాన్ని ఎవరికీ కనిపించకుండా ముద్రిస్తోందన్నది జియో ఆరోపణ.

దీనిపై గతంలో విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు, ప్రింట్ మీడియా ప్రకటనల్లో కనీసం 12 పిక్సెల్ పరిమాణంలో అక్షరాలుండాలని తీర్పిచ్చింది. వీడియో ప్రకటనలపైనా మార్గదర్శకాలు సూచించింది. హైకోర్టు ఆదేశాలను ఎయిర్ టెల్ ఖాతరు చేయడం లేదని ఆరోపిస్తూ, జియో సుప్రీంకోర్టులో తాజాగా స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసింది. అందరికీ కనిపించేలా పెద్ద అక్షరాల్లో నిబంధనలను ఉంచాలని రిజలయన్స్ జియో వాదిస్తుండగా, తాము హైకోర్టు ఆదేశాలను పాటిస్తున్నామని ఎయిర్ టెల్ చెబుతోంది.

More Telugu News