BJP: సీట్లు తక్కువగా వచ్చినందుకే కాంగ్రెస్‌-జేడీఎస్‌ సంబరాలు చేసుకుంటున్నాయా?: అమిత్‌ షా ఎద్దేవా

  • కర్ణాటకలో మా పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించింది
  • పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు
  • 122 సీట్లున్న కాంగ్రెస్‌ పార్టీ సీట్లు 78కి పడిపోయాయి

ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ హద్దులు దాటి ప్రవర్తించిందని, తమ పార్టీపై అసత్య ప్రచారాలు చేసిందని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా అన్నారు. అయినప్పటికీ తమ పార్టీకే ప్రజలు మద్దతు తెలిపారని చెప్పారు. ఈ రోజు న్యూ ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కర్ణాటకలో తమ పార్టీ అతిపెద్ద పార్టీగా అవతరించిందని, అందుకు కృషి చేసిన తమ పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు చెబుతున్నానని అన్నారు.

ఎన్నికల ముందు 122 సీట్లున్న కాంగ్రెస్‌ పార్టీ సీట్లు 78కి పడిపోయాయని, మరోవైపు ఆ పార్టీ సంబరాలు చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. జేడీఎస్‌కి కూడా కేవలం 37 సీట్లే వచ్చాయని, తక్కువ సీట్లు వచ్చినందుకే ఆయా పార్టీలు వేడుకలు చేసుకుంటున్నాయా? అని ప్రశ్నించారు. ప్రజా తీర్పుకు భిన్నంగా కాంగ్రెస్-జేడీఎస్ అపవిత్ర కూటమి ఏర్పాటు చేసి ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటోందని అన్నారు.

More Telugu News