Tamilnadu: చిన్న చేపే.. మనిషి ప్రాణం తీసింది!

  • సిద్ధ లింగమఠం గ్రామపు చెరువులో చేపలు పట్టిన అన్నామలై
  • వల కొసభాగంలో చిక్కుకుపోయిన చేప  
  • నోటితో ఆ చేపను తీస్తుండగా గొంతులో అడ్డంపడ్డ వైనం
  • ఊపిరాడక ప్రాణాలు కోల్పోయిన జాలరి

వలలో చిక్కిన చేపను తీసేందుకు యత్నిస్తున్న క్రమంలో చోటుచేసుకున్న సంఘటన ఓ జాలరి ప్రాణం తీసింది. తమిళనాడులోని విల్లుపురం జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సిద్ధ లింగమఠం గ్రామపు చెరువులో చేపలు పట్టేందుకు ఆరుంగురికై గ్రామానికి చెందిన అన్నామలై నిన్న మరికొంత మంది జాలర్లతో కలిసి వెళ్లాడు. అన్నామలై వలలో ఓ చేప చిక్కింది. అయితే, వల కొసభాగంలో ఇనుప ముల్లుకు ఈ చేప చిక్కుకుపోయింది.

దాంతో దానిని తీసే క్రమంలో ఆ చేపను నోటితో పట్టుకుని వల కొసను బలంగా లాగాడు. అన్నామలై ఊహించని విధంగా ఆ చేప అతని నోట్లోకి చేరి.. గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో, ఊపిరాడక పోవడంతో ఇబ్బంది పడ్డాడు. తోటి జాలర్లు అతన్ని సమీప ఆసుపత్రికి తరలించగా.. గొంతులో ఇరుక్కుపోయిన చేపను బయట తీసేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్న సమయంలో అన్నామలై మృతి చెందాడు. ఈ సంఘటనపై తిరుక్కోవిలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

More Telugu News