Mahanati: ఎవరినైనా ప్రేమిస్తే ధైర్యంగా మా ఇంట్లో వాళ్లకి చెప్పేస్తా!: కీర్తి సురేష్

  • 'మహానటి' చిత్రంలో సావిత్రిగా నటించిన కీర్తి
  • సినిమా హిట్ అయిన ఆనందంలో ఉన్న హీరోయిన్
  • ప్రేమిస్తే తల్లిదండ్రులతో చెప్పేస్తానంటున్న కీర్తి సురేష్

'మహానటి' చిత్రంలో సావిత్రిగా నటించి విమర్శకుల మెప్పును పొందిన యువనటి కీర్తి సురేష్, ఇప్పుడు సినిమా సూపర్ హిట్ కావడంతో ఆనందం పట్టలేకపోతోంది. తమిళంలో 'నడిగైయార్ తిలగం' పేరిట విడుదలైన చిత్రం, అక్కడా మంచి టాక్ తెచ్చుకుంది. ఈ సందర్భంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చిన కీర్తి సురేష్ తన మనసులోని అభిప్రాయాలను పంచుకున్నారు.

సావిత్రి జీవితంలో జరిగిన విధంగానే ప్రేమ పెళ్లి, ఆపై సినిమాల నిర్మాణం, దర్శకత్వం వహిస్తారా? అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది. తన తల్లి మేనక, బామ్మ సరోజ నటీమణులని గుర్తు చేస్తూ, సిస్టర్ పార్వతి సైతం సినిమా రంగంలోనే ఉందని, నాన్న నిర్మాతని చెప్పింది. తాను మాత్రం నిర్మాతగా మారబోనని, ఇక దర్శకత్వం చేసేందుకు అర్హత, ప్రతిభ తనకు ఉన్నాయని భావించడం లేదని చెప్పింది. ఇక ప్రేమ వివాహం అంటే మాత్రం ఇప్పుడే ఏమీ చెప్పలేనని, ఇప్పట్లో తనకు పెళ్లి ప్రస్తావనే అనవసరమని చెప్పింది. తన తల్లిదండ్రులది ప్రేమ వివాహమేనని, భవిష్యత్తులో తాను ఎవరినైనా ప్రేమిస్తే, ఆ వెంటనే తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పగలనని, వారి అంగీకారంతోనే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది.

More Telugu News