Somayajulu: వైసీపీ నేత సోమయాజులు మృతితో నేటి పాదయాత్ర వాయిదా... హైదరాబాద్ కు జగన్!

  • ఈ తెల్లవారుజామున కన్నుమూసిన సోమయాజులు
  • ప్రస్తుతం వైసీపీ రాజకీయ వ్యవహారాలు చూస్తున్న సోమయాజులు
  • తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన వైఎస్ జగన్

వైఎస్సార్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు, తనకు అత్యంత నమ్మకస్తుడైన డీఏ సోమయాజులు ఈ తెల్లవారుజామున 3 గంటల సమయంలో మరణించగా, నేటి తన పాదయాత్రను వైఎస్ జగన్ వాయిదా వేసుకున్నారు. గత కొంత కాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న సోమయాజులు, హైదరాబాద్‌ లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

విషయం తెలుసుకున్న జగన్, తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. పాదయాత్రను వాయిదా వేసుకుని హైదరాబాద్ కు బయలుదేరారు. కాగా, రెండు రోజుల క్రితం ఆయనకు బీపీ పడిపోయిందని, పరిస్థితి విషమంగా ఉందని తెలియడంతో జగన్ సతీమణి భారతీ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు, తెలంగాణ కాంగ్రెస్ నేత జానారెడ్డిలతో పాటు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాథ్, వాసిరెడ్డి పద్మ తదితరులు ఆయన్ను పరామర్శించి వచ్చారు.

More Telugu News