yeddyurappa: మూడోసారి కూడా యడ్యూరప్పను వెక్కిరించిన అదృష్టం

  • మూడు సార్లు ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన యడ్డీ
  • ఒక్కసారి కూడా పూర్తి కాలం పదవిలో కొనసాగలేని దురదృష్టం
  • తాజాగా మూడు రోజులకే రాజీనామా చేయాల్సిన పరిస్థితి

యావత్ భారతదేశంలో యడ్యూరప్ప అంత దురదృష్టవంతుడు ఎవరూ ఉండరేమో. ఇప్పటికి మూడుసార్లు సీఎం పీఠాన్ని అధిష్టించినప్పటికీ... ప్రతిసారి కూడా ఆయన అధికారం మూన్నాళ్ల ముచ్చటగానే ముగిసింది. 2007 నవంబర్ 12న కర్ణాటక ముఖ్యమంత్రిగా ఆయన తొలిసారి బాధ్యతలను స్వీకరించారు. జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వంలో భాగంగా ఆయన సీఎం అయ్యారు. అయితే మద్దతును కొనసాగించేందుకు జేడీఎస్ నిరాకరించడంతో... కేవలం వారం రోజులకే ముఖ్యమంత్రి పదవిని ఆయన కోల్పోయారు.

2008 మే 30న ముఖ్యమంత్రిగా ఆయన రెండోసారి బాధ్యతలను చేపట్టారు. అయితే, అక్రమ మైనింగ్ కేసులో యడ్యూరప్ప పేరును లోకాయుక్త చేర్చడంతో... ఆయనపై కేంద్ర నాయకత్వం నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చింది. దీంతో, విధిలేని పరిస్థితుల్లో 2011 జులై 31న రెండోసారి ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు.

తాజాగా చాలినంత మెజార్టీ లేకున్నా... సింగిల్ లార్జెస్ట్ పార్టీ అని చెప్పుకుంటా, గవర్నర్ అండతో యడ్యూరప్ప ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. బలనిరూపణకు యడ్డీకి 15 రోజుల సమయాన్ని గవర్నర్ ఇచ్చారు. అయితే కాంగ్రెస్, జేడీఎస్ లు సుప్రీంకోర్టు తలుపులు తట్టడంతో... ఈ సాయంత్రం 4 గంటలకు బలాన్ని నిరూపించుకోవాల్సి వచ్చింది. కానీ యడ్డీని విధి మరోసారి వెక్కిరించింది. ఎన్ని ప్రయత్నాలు చేసినా మ్యాజిక్ ఫిగర్ ను సాధించడం బీజేపీ వల్ల కాలేదు. దీంతో, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మూడోసారి ముచ్చటగా మూడు రోజుల్లోనే ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

More Telugu News