Madhya Pradesh: ప్రభుత్వ పాఠశాలల్లో ఇకపై హాజరు సమయంలో 'జైహింద్‌' అనాలి... మధ్యప్రదేశ్‌ సర్కారు ఉత్తర్వులు

  • హాజరు తీసుకునే సమయంలో ఇకపై  ఎస్‌, నో వంటి పదాలు అనకూడదు
  • ప్రైవేటు పాఠశాలల్లోనూ ఇష్టం ఉంటే అనొచ్చు
  • ప్రభుత్వ నిర్ణయంపై విమర్శలు

పాఠశాలల్లో హాజరు చెప్పేటప్పుడు ఇకపై ప్రతి ఒక్క విద్యార్థి 'జైహింద్‌' అనాలని ఎస్‌, నో వంటి పదాలు అనకూడదని మధ్యప్రదేశ్‌ రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, ప్రభుత్వ పాఠశాలల్లో మాత్రమే ఈ విధానాన్ని అమలులోకి తెస్తున్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఇష్టం ఉంటే అనొచ్చు, లేదంటే అక్కర్లేదని విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు సూచిస్తూ స్కూళ్లకు లేఖలు పంపించామని పేర్కొంది.

మధ్యప్రదేశ్‌లో మొత్తం 1.22 లక్షల ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇకపై వారంతా హాజరు పలికే సమయంలో ‘జై హింద్‌’ అని చెప్పాల్సిందే. ఇలా చేస్తే పిల్లల్లో దేశభక్తి పెరుగుతుందని ఆ రాష్ట్ర సర్కారు భావిస్తోంది. అయితే, ఆ రాష్ట్ర  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నారు. దేశభక్తిని బలవంతంగా రుద్దలేమని, మొదట ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నాణ్యతను పెంచాలని, పిల్లలకు పాఠాలు చెప్పేందుకు తగినంత మంది ఉపాధ్యాయులు కూడా ఉండట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉన్న విషయం తెలిసిందే. 

More Telugu News