Bihar: కోడలు వచ్చింది.. శుభాలు తెచ్చింది.. మురిసిపోతున్న రబ్రీదేవి

  • ఐశ్వర్య రాయ్ అడుగుతో అన్నీ శుభాలే జరుగుతున్నాయన్న రబ్రీదేవి
  • కొత్త కోడలిని చూసి మురిసిపోతున్న లాలు దంపతులు
  • పెరోల్ ముగియడంతో తిరిగి జైలుకెళ్లిన లాలు

కొత్త కోడలిని చూసి బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ సతీమణి రబ్రీదేవి మురిసిపోతున్నారు. తమ కోడలు బంగారమని, అంతా శుభ సూచకాలే కనిపిస్తున్నాయని, ఆమె ఇంట్లో అడుగుపెట్టిన వేళా విశేషం అటువంటిదని చెప్పి ఆనందం వ్యక్తం చేశారు. సోమవారం దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేసిన లాలు, రబ్రీలను కొత్త కోడలు గురించి మీడియా అడగగా, పై విధంగా స్పందించారు.

ఐశ్వర్య రాయ్‌తో తమ కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌కు నిశ్చితార్థం అయినప్పటి నుంచి తమ ఇంట్లో అన్నీ శుభాలే జరుగుతున్నాయని  తెలిపారు. ఎంగేజ్‌మెంట్ తర్వాత లాలుకు మూడు రోజుల పెరోల్ వచ్చిందని, ఆరు వారాల ప్రొవిజనల్ బెయిల్ వచ్చిందని పేర్కొన్నారు. అలాగే, విధాన పరిషత్‌లో రబ్రీదేవి ప్రతిపక్ష నేతగా ఎంపికయ్యారు. దీంతో కోడలు వచ్చిన తర్వాత అన్నీ శుభసూచకాలే కనిపిస్తున్నాయని ఆనందం వ్యక్తం చేశారు.

మరోవైపు, మూడు రోజుల పెరోల్ ముగియడంతో లాలు జైలుకు వెళ్లిపోయారు. నేటి నుంచి ఆరు వారాల ప్రొవిజనల్ బెయిలు అమల్లోకి వస్తుండడంతో నేటి సాయంత్రం వైద్య పరీక్షల నిమిత్తం తిరిగి పాట్నా చేరుకోనున్నారు.

More Telugu News