Andhra Pradesh: రొయ్యల రైతులు నష్టపోకుండా నాలుగురోజుల్లో ధర నిర్ణయిస్తాం: ఏపీ మంత్రి ఆదినారాయణరెడ్డి

  • తగ్గుతున్న ధరలకు కళ్లెం వేస్తాం
  • వచ్చే శుక్రవారం నాటికి ఒక ధర నిర్ణయిస్తాం 
  • ఆ ధరకే వచ్చే నెలాఖరు వరకు రొయ్యల కొనుగోళ్లు

కొంతకాలంగా రోజురోజుకీ తగ్గుతున్న రొయ్యల ధరలపై సాగు రైతు నష్టపోకుండా చర్యలు చేపడతామని ఏపీ మార్కెటింగ్, గిడ్డంగులు, పశుగణాభివృద్ధి, పాడిపరిశ్రమ, మత్స్యశాఖ, సహకారశాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి హామీ ఇచ్చారు. అమరావతి సచివాలయంలో రొయ్యల సాగు రైతులు, ఎగుమతిదారులతో ఈరోజు సమావేశం నిర్వహించారు.

నిలకడ లేని ధరల వల్ల రొయ్యల సాగు నిలిపివేయాల్సిన పరిస్థితి వచ్చిందంటూ రైతుల ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం గమనించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, వచ్చే శుక్రవారం నాటికి ఒక ధర నిర్ణయిస్తామని, ఆ ధరకే వచ్చే నెలాఖరు వరకు రొయ్యలు కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు చెప్పారు.

 సమావేశంలో మత్స్యశాఖ ఉన్నతాధికారులు, సముద్ర ఉత్పత్తులు, ఎగుమతుల అభివృద్ధి సంస్థ (ఎంపెడా) అధికారులు, ఉభయగోదావరి, ప్రకాశం, నెల్లూరు జిల్లాల నుంచి రొయ్యల సాగు రైతులు, ఎగుమతిదారులు పాల్గొన్నారు. ఈ విషయమై ఎంపెడా అధికారులతో ఈ గురువారం చర్చించి ఇటు రైతుకు, అటు ఎగుమతిదారులకు నష్టం లేని ధరను నిర్ణయించాలని ఈ సమావేశం నిర్ణయించింది. అంతర్జాతీయ విపణిలో ధరల తగ్గుదల భారీగా ఉంటే తప్ప ఈ నిర్ణయించే ధరలో మార్పులు ఉండరాదని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్నారు.
 
నెలలోనే మూడుసార్లు రొయ్యల ధర తగ్గిపోయింది!

సాధారణంగా జనవరి నుంచి జూన్, జూలై వరకు రొయ్యలకు డిమాండ్ తగ్గి ధర తగ్గుతుందని, అయితే ఈ ఏడాది ధర దారుణంగా పడిపోయిందని రైతులు వివరించారు. నెలలోనే మూడుసార్లు ధర తగ్గిపోయిందని, ఇప్పుడు 100 కౌంట్ కు కిలో రూ.160 అంతకన్నా తక్కువే ఎగుమతిదారులు చెల్లిస్తున్నారని తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా 28 శాతం మేర ధర తగ్గిపోయిందని సమావేశంలో రైతులు వివరించారు. ఉత్పత్తి వ్యయం కూడా రాకపోవడమే కాక భారీగా నష్టపోయే  పరిస్థితులు ఎదురవుతున్నాయని, ఇదే కొనసాగితే క్రాప్ హాలిడే ప్రకటించక తప్పదని ఆవేదన వ్యక్తం చేశారు. మన రొయ్యల ఉత్పత్తిలో యాంటీబయాటిక్స్ .. ఎగుమతుల్ని నిలిపివేసిన ఆస్ట్రేలియా, ఈయూ  
రొయ్యల ధరల నిలకడ లేకపోవడానికి ఈ సమావేశంలో కారణాలను విశ్లేషించగా..రొయ్యల ఉత్పత్తిలో యాంటీబయాటిక్స్ వినియోగం ఉన్నాయంటూ యూరోపిన్ యూనియన్ (ఈయూ), ఆస్ట్రేలియా మన దేశ ఎగుమతుల్ని నిలిపివేయడంతో మన ఎగుమతి మార్కెట్ తగ్గింది. అయితే అదే సమయంలో అమెరికాకు  20 శాతం ఎగుమతులు పెరిగినా సరఫరాకు తగిన డిమాండ్ లేదు. చైనా మన రొయ్యలను కొనుగోలు చేస్తున్నప్పటికీ తక్కువ ధర అయితేనే కొనుగోలుకు ఆసక్తి చూపుతోంది. ఎక్కువ ధర ఇచ్చేందుకు ఇష్టపడటం లేదు.

 అదే సమయంలో ఇండోనేషియా, ఫిలిఫైన్స్, థాయ్ లాండ్, వియత్నాం, ఈక్వెడార్ లలో ఉత్పత్తి పెరిగి అవి మన దేశ ఎగుమతులతో పోటీ పడుతున్నాయి. మిగిలిన దేశాల ఉత్పత్తులను యాంటీబయాటిక్స్ వాడకం అంటూ నిలిపివేసిన నెలల వ్యవధిలోనే ఆయా దేశాలు ఆస్ట్రేలియా, యూరోపియన్ యూనియన్ తో సంప్రదింపులు జరిపి వారి సూచనలకు అనుగుణంగా సర్టిఫికేషన్ జత చేయడానికి ఆమోదించి ఎగుమతుల్ని పునరుద్ధరించుకుంటున్న అంశం ఈ సమావేశంలో చర్చకు వచ్చింది.

మంత్రివర్గ సమావేశంలో ప్రస్తావిస్తా 

ఇదే రీతిలో మన కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఆయా దేశాధినేతలతో సంప్రదింపులు జరిపి ఎగుమతుల్ని పునరుద్ధరించేలా చర్యలకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలనే నిర్ణయానికి వచ్చారు. బుధవారం జరగనున్న మంత్రివర్గ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించి ముఖ్యమంత్రితో కేంద్ర ప్రభుత్వానికి, సంబంధిత మంత్రికి ఓ లేఖ రాయడమే కాక అనుశీలన జరిగేలా కృషి జరిగేలా చూస్తానని మంత్రి ఆదినారాయణ రెడ్డి ఈ సమావేశంలో ప్రకటించారు.

 ప్రతి 100 గంటలకోసారి ప్రకటించాలి

రొయ్యల ధర అంతర్జాతీయ మార్కెట్లో ఎలా ఉందన్నది ప్రతి 100 గంటలకోసారి ప్రకటించాలని ఎంపెడా అధికారిని మంత్రి ఆదేశించారు. అంతర్జాతీయ మార్కెట్ ధరను ప్రతిరోజు ప్రకటించడం సాధ్యం కాదని వివరాలు పరిశీలించిన మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. యాంటీబయాటిక్స్ వాడకం అన్ని దశల్లో నిలిపివేయాలని మంత్రి పునరుద్ఘాటించారు. యాంటీబయాటిక్స్ తయారీదారులపై, వాడకందారులపైన కఠిన చర్యలు ఉంటాయని తెలిపారు.

అమరావతి నుంచి బృందాలను పంపి తనిఖీలు చేస్తామని చెప్పారు. తయారీదారులైనా, వాడకం దారులైనా ఎవరినీ వదలిపెట్టమని క్రిమినల్ కేసులతో పాటు తీవ్రత మేరకు పీడీ చట్టం కూడా ప్రయోగిస్తామని పశుసంవర్ధక, మత్స్యశాఖల ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హెచ్చరించారు. రొయ్యల సాగు రైతులకు విద్యుత్ సరఫరా నాణ్యత మరింత మెరుగుపరిచే నిమిత్తం 132 కె.వి. 220 కె.వి. విద్యుత్ సబ్ స్టేషన్ల పెంపు విషయమై కూడా బుధవారం నాటి మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునేలా చూస్తానని మంత్రి  ప్రకటించారు.    

More Telugu News